భార్య అనుమానాస్పద మృతి….. ఆచూకీలేని భర్త

  • Published By: murthy ,Published On : November 16, 2020 / 03:00 PM IST
భార్య అనుమానాస్పద మృతి….. ఆచూకీలేని భర్త

married women suspicious death : ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఒక వివాహిత శవమై తేలగా, ఆమె భర్త ఆచూకి లభించటం లేదు. అతను సజీవంగా ఉన్నాడా ?….హత్యకు గురయ్యాడా ?…..లేక భార్యను చంపి పరారయ్యాడా ? అనేది తేలాల్సి ఉంది.

మార్టూరు మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన మద్దుమాల పద్మ(38) భాస్కరరావు దంపతులు. ఉన్నత విద్యావంతులైన వీరు కనిగిరిలో ఒక ప్రైవేట్ స్కూలులో గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా స్వగ్రామం వచ్చి విద్యార్ధులకు ఆన్ లైన్ లో క్లాసులు బోధిస్తున్నారు.



వీరిద్దరూ నవంబర్ 13వ తేదీ శుక్రవారం సాయంత్రం యద్దనపూడి మండలం, పూనూరులోని బంధువుల ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి రాత్రి స్వగ్రామం బయలు దేరారు. కానీ ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన బంధువులు అదే రోజు రాత్రి మార్టూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
https://10tv.in/school-girl-suspicious-death-in-adilabad-district/
దంపతుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం నాడు కోనంకి, లక్కవరం గ్రామాల మధ్య పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన ఎస్సై శివకుమార్‌ మహిళ మృతదేహాన్ని…. శుక్రవారం రాత్రి కన్పించకుండా పోయిన పద్మదిగా గుర్తించారు. బంధువులకు సమాచారం అందించి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



ఇలా ఉండగా పద్మ భర్త భాస్కరరావు ఆచూకీ ఇంత వరకు లభించలేదు. దీంతో బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భాస్కరరావు అనుమానంతో భార్య పద్మను తరచూ వేధించే వాడని, అతడే చంపి ఉంటాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. పోస్టు మార్టం నివేదిక, భాస్కరరావు ఆచూకి లభిస్తేగానీ హత్యకు గల కారణాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు.