కరోనా నెగెటివ్ రిపోర్టుకు బదులు పాజిటివ్ రిపోర్టు… వైద్య సిబ్బంది పొరపాటుకు నిండు ప్రాణం బలి

  • Published By: bheemraj ,Published On : July 8, 2020 / 05:34 PM IST
కరోనా నెగెటివ్ రిపోర్టుకు బదులు పాజిటివ్ రిపోర్టు… వైద్య సిబ్బంది పొరపాటుకు నిండు ప్రాణం బలి

కరోనా రిపోర్టు విషయంలో జరిగిన పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి 15 రోజుల పాటు తీవ్ర మానసిక సంక్షోభకు గురైంది. అందరూ ఉన్నా అమ్మకు అనాథలా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి తలెత్తిందన్న బాధ వారిని నిలువునా కూల్చివేస్తోంది. పైగా కరోనా అంటూ ఆ కుటుంబంపై చిన్నచూపు. ఇన్ని బాధల నేపథ్యంలో పొరపాటు జరిగిపోయింది.. ఆమెకు కరోనా పాజిటివ్ కాదు అంటూ చిన్న సారీతో సరిపెట్టారు.

గుంటూరులోని హనుమయ్య నగర్ కు చెందిన తిరుపతమ్మకు గత నెల 22న గుండెపోటు రావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది ఆమె శాంపిల్ సేకరించి జీఎంసీకి పంపారు. ఫలితం వచ్చాకా చికిత్స చేస్తామన్నారు. జూన్ 24న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తిరుపతమ్మకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆమెను వెంటనే తీసుకెళ్లాలని లేదంటే తామే బయటకు పంపిస్తామని తేల్చి చెప్పారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అదే రోజు రాత్రి గుంటూరు జీజీహెచ్ లో చేర్పించారు. జూన్ 25న ఉదయం తిరుపతమ్మకు మరోసారి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఇదే సమయంలో మున్సిపల్, పోలీసు సిబ్బంది ఆమె ఇంటి చుట్టూ కంచె నిర్మించి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. కరోనా నిబంధనల ప్రకారం కుటుంబసభ్యులెవరూ లేకుండానే జీఎంసీ సిబ్బంది ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.

నిన్న ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేసి తిరుపతమ్మకు కరోనా సోకలేదని, మున్సిపల్ సిబ్బంది పొరపాటు కారణంగా కరోనా అని పంపేశామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్ కు వెళ్లి వాకబు చేస్తే పరీక్ష ఫలితం నెగెటివ్ వచ్చిందని తేల్చింది. ఒక వేల ఆమెకు రెండు సార్లు పరీక్షలు నిర్వహించారా అంటే లేదు. జూన్ 22న ఒకేసారి పరీక్ష చేశారు. కానీ ఇన్ని రోజులుగా తాము పడుతున్న మానసిక వేధనను ఎవరు తీరుస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.