చంపిన తర్వాత..మళ్లీ వస్తారనే మూఢనమ్మకం..మదనపల్లెల్లో దారుణం, షాకింగ్ విషయాలు

చంపిన తర్వాత..మళ్లీ వస్తారనే మూఢనమ్మకం..మదనపల్లెల్లో దారుణం, షాకింగ్ విషయాలు

Mentally disturbed : మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతి కిరాతకంగా హత్యచేశారు. క్షుద్రపూజల పేరిట, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లను చంపేశారు. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించి ఇంతటి ఆధునిక సమాజంలో కూడా.. ఇలాంటి క్షుద్రపూజలు చేసే వాళ్లుండడం.. అది కూడా ఎంతో చదువుకున్న వారు.. ఇలాంటి పూజలకు తమ సొంత కూతుళ్లనే బలిచేయడంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని టీచర్స్‌ కాలనీ శివనగర్‌లో భార్యాభర్తలు వల్లూరుపల్లె పురుషోత్తం నాయుడు, పద్మజ ఉంటున్నారు. పురుషోత్తం నాయుడు ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌గా ఉండగా, తల్లి పద్మజ ఓ ప్రైవేటు విద్యాసంస్థకు కరస్పాండెంట్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య, సాయిదివ్య అనే ఇద్దరు కుమార్తెలు. పద్మజకు విపరీతమైన భక్తి భావాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి.

దారుణంగా చంపేశారు : –
గత కొంతకాలంగా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయని పురుషోత్తమ్, పద్మజ దంపతులు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో పూజలు నిర్వహించారు. మొదట సాయి దివ్యను, తర్వాత అలేఖ్యను వ్యాయామం చేసే డంబెల్‌తో కొట్టి హత్యచేశారు. హత్యకు ముందు పెద్ద కూతురికి సగం గుండు కొట్టించారు. పైన ఉన్న అంతస్తులో ఒకరిని, కింద అంతస్తులో ఇంకొకరికి చీర కట్టి.. నోట్లో రాగి చెంబు పెట్టి.. తలపై డంబెల్‌లో కొట్టి చంపారు. ఇద్దరు కూతుళ్లను పాశవికంగా హత్య చేసిన తర్వాత వారు పూనకంతో ఉగిపోయారు. పుణ్యలోకాలకు వెళ్లిన ఇద్దరు కూతుళ్లు తిరిగి వచ్చేస్తారంటూ కేకలు వేశారు. అదే సమయానికి అక్కడికి చెరుకున్న పురుషోత్తమ్ సొదరుడు మృతదేహాలను చూసి షాక్‌కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.

భయంకరమైన దృశ్యాలు : –
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్య తర్వాత ఇంటి లోపల భయంకరమైన దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. ఇద్దరు పిల్లల హత్యతో గదులు రక్తసిక్తంగా మారిపోయి ఉన్నాయి. బిడ్డలకు సగం గుండు కొట్టించి నగ్నంగా పూజలు చేయించినట్లు పోలీసులకు అర్ధమయ్యింది. అయితే తల్లిదండ్రులు పోలీసులను లోపలకి రానివ్వలేదు. ఇవాళ్టితో కలియుగం ముగిసిందని.. రేపటి నుంచి సత్యయుగం ప్రారంభం కాబోతోందంటూ పిచ్చి వాగుడు వాగారు. తాము చేసిన పూజలతో.. తామిచ్చిన బలులతో కరోనా కూడా అంతమైపోతోందన్నారు. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారితో వాదించారు. ఇంట్లోకి రావొద్దంటూ దంపతులిద్దరూ డీఎస్పీని హెచ్చరించారు. వారి ఇంట్లో చూస్తే ఆద్యాత్మిక పుస్తకాలు కుప్పలుగా పడి ఉన్నాయి.

కలియుగం, సత్యయుగం అంటూ వాదనలు : –
తల్లిదండ్రులు ఇద్దరూ పూర్తిగా ట్రాన్స్‌లో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. చనిపోయిన వారిలో చిన్నకూతురు దివ్య ఏఆర్‌ రెహ్మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మ్యూజిక్‌ నేర్చుకుంటోంది. పెద్ద కూతురు అలేఖ్య ఎంబీయే చేసి భోపాల్‌లో జాబ్‌ చేస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే ఎవరో వీరిని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. వారిని కదిలిస్తే.. సృష్టి, కలియుగం, సత్యయుగం అంటూ మాట్లాడుతున్నారని తెలిపారు.

పిల్లలు తిరిగి వస్తారంటూ పిచ్చివాగుడు : –
ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఉన్నత విద్యావంతులే ఆధ్యాత్మిక పిచ్చితో కన్న పిల్లల్నే దారుణంగా చంపడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. నిందితురాలు పద్మజ ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్. అయితే పోలీసుల దర్యాప్తులో వీరు చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. తమ కుమార్తెలను మళ్లీ బతికించుకుంటామని చెబుతున్నారు. ఒక్క రోజు టైం ఇస్తే తమ పిల్లలు తిరిగివస్తారని పిచ్చివాగుడు వాగుతున్నారు. ఎలా బతికిస్తారని అడిగితే.. అది సృష్టి రహస్యమని చెబుతున్నారని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి ఆధ్యాత్మిక పిచ్చితో ఉన్నత విద్యావంతులే తమ కన్నపిల్లల్ని చంపడం ప్రజల్ని విస్మయానికి గురి చేసింది.