రాజధానిలో ల్యాండ్ స్కామ్.. చంద్రబాబు, లోకేష్ పేర్లు ఎఫ్ఐఆర్‌లో పెడతారు

  • Published By: naveen ,Published On : September 12, 2020 / 05:21 PM IST
రాజధానిలో ల్యాండ్ స్కామ్.. చంద్రబాబు, లోకేష్ పేర్లు ఎఫ్ఐఆర్‌లో పెడతారు

అంతర్వేది రథం దగ్ధం ఘటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేవుళ్లను, ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, దేవుళ్లను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలకు తెలుసు అన్న ఆయన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అంతర్వది ఘటనపై శనివారం(సెప్టెంబర్ 12,2020) మీడియాతో మాట్లాడిన బొత్స… అంతర్వేది ఘటనపై ఆందోళన చేసిన వారిని, ప్రార్థనా మందిరాలపై రాళ్లు వేసిన వారిని విడుదల చేయాలంటూ ఓ జాతీయ పార్టీ ధర్నాలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అక్కర్లేదా? లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఎవరున్నా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, రాజకీయ పార్టీ అంటే అవాకులు చెవాకులు మాట్లాడ్డానికి, ఇతరులపై బురద చల్లడానికి ఉద్దేశించింది కాదని మంత్రి బొత్స హితవు పలికారు. ఓ విధానం ప్రకారం, ఓ సిద్ధాంతం ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.

చంద్రబాబుకు ఇలాంటి సిద్ధాంతాలు, విధానాలు ఏవీ లేవని, అవసరమైతే కాళ్లు, గడ్డాలు పట్టుకుంటారని, లేకపోతే తిట్టిస్తారని మంత్రి బొత్స విమర్శించారు. మతానికి, దేవుడికి, రాజకీయాలకు ముడిపెట్టే ఇలాంటి చర్యలను, ఆలోచనా విధానాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఇదొక దుష్ట సంప్రదాయం అన్నారు. రాజకీయ పార్టీగా నిరసన తెలియజేసే హక్కు ఉందని, దాని ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించామని, ఏదైనా ఘటన జరిగితే వెంటనే విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. అంతర్వేదిలో రథం కాలిపోయిందా, లేక కాల్చారా అనేది సీబీఐ విచారణలో తేలుతుందని బొత్స స్పష్టం చేశారు. కాగా, గోదావరి పుష్కరాల్లో భక్తులు చనిపోతే చంద్రబాబు ఏ విచారణకు ఆదేశించారో చెప్పాలని బొత్స నిలదీశారు.
https://10tv.in/cbi-inquiry-in-antarvedi-chariot-fire-incident/
రాజధాని భూముల కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందని మంత్రి బొత్స ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములు దోచుకున్నారని చెప్పారు. రాజధానిలో క్విడ్ ప్రో కో కు పాల్పడింది నిజం కాదా? అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మంత్రి బొత్స.. అక్రమాలు జరిగినట్టు తేలితే లోకేష్, చంద్రబాబు పేర్లు ఎఫ్ఐఆర్ లో పెడతారని స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో త్వరలో పనులు ప్రారంభించబోతున్నామన్నారు.