Minister Roja : ఎన్టీఆర్కు అన్నం పెట్టి సరిగా చూసుకుని ఉంటే.. ఈరోజు ప్రధాని అయ్యేవారు-మంత్రి రోజా
వాళ్ల కుటుంబసభ్యులు కనుక చక్కగా ఎన్టీఆర్ ను చూసుకుని, ఆయనకు అన్నం పెట్టి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుకి సపోర్ట్ చేయకుండా.. ఆయనను మెడపట్టుకుని బయటకు గెంటేసి ఉంటే.. ఈరోజు ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యే స్థాయిలో ఉండేవారు.
Minister Roja : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబంపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. అధికారంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లోనూ భంగం తప్పదన్నారు మంత్రి రోజా. ఈసారి కుప్పంలోనూ చంద్రబాబుకి ఓటమి తప్పదని ఆమె జోస్యం చెప్పారు. మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ఎన్టీఆర్ కుటుంబం రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు రోజా.
వచ్చే ఎన్నికల్లోనూ.. నువ్వు నెగ్గేది లేదు.. జగనన్న తగ్గేది లేదు.. అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు రోజా. మొన్న పోతే పోనీ అని 23 సీట్లు ఇచ్చారు.. ఈసారి కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ఎన్టీఆర్ కుటుంబం రాజకీయం చేస్తోందని మంత్రి రోజా ఫైర్ అయ్యారు.
”వాళ్ల కుటుంబసభ్యులు కనుక చక్కగా ఎన్టీఆర్ ను చూసుకుని, ఆయనకు అన్నం పెట్టి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుకి సపోర్ట్ చేయకుండా.. ఆయనను మెడపట్టుకుని బయటకు గెంటేసి ఉంటే.. ఈరోజు ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యే స్థాయిలో ఉండేవారు. బతికుండగానే ఎన్టీఆర్ ను చంపేసిన చంద్రబాబు నాయుడు, ఆ కుటుంబ పెద్దలకి.. జగనన్న గురించి మాట్లాడే అర్హత లేదు” అని ధ్వజమెత్తారు రోజా.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో పెను దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు, వైసీపీ నేతలు సమర్థిస్తుంటే.. టీడీపీ నేతలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీఎం జగన్ తీరుపై వారు ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ మహనీయుడు, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి పేరు తొలగించడం కరెక్ట్ కాదంటున్నారు. ఇక, ఎన్టీఆర్ అంటే తనకూ అభిమానం ఉందంటూ ఏకంగా సీఎం జగనే.. ఆచితూచి మాట్లాడుతుంటే.. మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం నోటికి పని చెబుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పై మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచాయి. ఎన్టీఆర్ అంత చేతకాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడంటూ సంచలన కామెంట్స్ చేశారు మంత్రి దాడిశెట్టి రాజా.