Ushasri Charan On JCPrabhakar : కళ్యాణదుర్గంకి వచ్చి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు- జేసీపై మంత్రి ఫైర్
బీసీ మహిళకు మంత్రి పదవి లభించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేకుండా ఉన్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతు కోల్పోయినా..
Ushasri Charan On JCPrabhakar : ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్.. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కళ్యాణదుర్గానికి వచ్చి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. బీసీ మహిళకు మంత్రి పదవి లభించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేకుండా ఉన్నారని ఆమె మండిపడ్డారు. ప్రజల మద్దతు కోల్పోయినా రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకే చెల్లుతుందన్నారు.
వెయ్యి గొర్రెల మందలో ఒక్క గొర్రె తప్పిపోయినా దాన్ని తిరిగి తీసుకొచ్చి మందలో కలిపే శక్తి నాకుందన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. తనపై దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని మంత్రి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. క్యాబినెట్ విస్తరణలో 45శాతం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం జగనన్నకే సాధ్యం అన్నారు. అనంతపురం జిల్లాలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారని, బీసీలందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం వైసీపీకే సాధ్యం అన్నారామె. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కలుస్తానని, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.(Ushasri Charan On JCPrabhakar)
కాగా, అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ కోసం ఏర్పాటు చేసిన స్వాగత సంబరాలు వివాదానికి దారితీశాయి. మంత్రి కోసం ఏర్పాటు చేసిన స్వాగత సంబరాలు.. ఓ చిన్నారి ప్రాణం తీశాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న ఏడు నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తున్న వాహనాన్ని.. మంత్రిగారి స్వాగత సంబరాల పేరుతో పోలీసులు నిలిపివేశారని, దీంతో, ఆసుపత్రికి చేరుకునేందుకు ఆలస్యమై పాప ఆరోగ్యం విషమించి ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
AP New cabinet: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉషశ్రీ చరణ్
ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రతిపక్షాలు మంత్రిని టార్గెట్ చేశాయి. తీవ్ర విమర్శలు గుప్పించాయి. మంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారని, అందువల్లే చిన్నారి చనిపోయిందని ఆరోపించారు. పాప మృతికి మంత్రే కారణం అని విపక్ష నేతలు అన్నారు.
AP Cabinet: శాఖలు ఖరారు.. ఐదుగురికి డిప్యూటీ సీఎంగా చాన్స్.. హోం మంత్రిగా తానేటి వనిత..!
ఈ వ్యవహారం దుమారం రేపడంతో స్వయంగా మంత్రి ఉషశ్రీ చరణ్ స్పందించారు. కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్గా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారని.. నియోజకవర్గంలో వైసీపీ ప్రభంజనానికి భయపడి అక్కడి ఇంచార్జ్ శిశువుతో శవ రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. శవ రాజకీయం చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. వారిని ఆంజనేయస్వామి చూసుకుంటాడని తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు దీనిపై జిల్లా ఎస్పీ కూడా స్పందించారు. మంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించినందువల్లే చిన్నారి మరణించింది అనడం అవాస్తవమని ఆయన అన్నారు.