క్లాస్‌రూమ్‌లో మైనర్ల మ్యారేజ్.. టీసీ ఇచ్చేసిన కాలేజ్!

  • Published By: vamsi ,Published On : December 3, 2020 / 11:32 AM IST
క్లాస్‌రూమ్‌లో మైనర్ల మ్యారేజ్.. టీసీ ఇచ్చేసిన కాలేజ్!

Minors marriage in College: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి-అబ్బాయి పెళ్లి చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్‎లోనే మైనర్ విద్యార్ధులు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. నవంబర్ 17న మైనర్లు వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.



ఈ విషయం బయటకు రావడంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లడంతో.. ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చి టీసీ ఇచ్చి కాలేజీ నుంచి పంపేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేసి, నుదిటిన బొట్టు పెట్టాడు. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో ఈ వీడియోలను రికార్డ్ చేసుకొగా.. పక్కనే మరికొందరు విద్యార్థులు ఉన్నట్లు అర్థం అవుతుంది.



బొమ్మలాటలో చేసుకున్నట్లుగా సరదాగా ఈ పని చేశారా? నిజంగానే పెళ్లి చేసుకోవాలనే తలంపులో ఈ పనికి ఒడికట్టారా? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. పిల్లలు చేసిన ఈ పనికి వారి కుటుంబాలు తలలు పట్టుకున్నాయి. ఈ పెళ్లి సరాదాగా జరిగిందా? ఉద్దేశపూర్వకంగా చేసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.