ప్రకాశంలో దారుణం : తల్లి, పసిపాపను తగులబెట్టారు

  • Published By: madhu ,Published On : December 4, 2019 / 12:40 AM IST
ప్రకాశంలో దారుణం : తల్లి, పసిపాపను తగులబెట్టారు

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తల్లీబిడ్డను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టిన ఘటన కలకలం రేపుతోంది. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట-లింగంగుంట గ్రామాల సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఏడాది చిన్నారి సహా మహిళను దుండగులు అత్యంత దారుణంగా చంపేసి తగులబెట్టేశారు. ఎక్కడో చంపి ఇక్కడకి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు. 

స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళ తల వెనక భాగంలో రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. చిన్నారి గొంతు కోసినట్లు నిర్ధారించారు. చిన్నారితో సహా చంపేసి తగులబెట్టడంతో పలు కోణాల్లో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఆధారాలు దొరక్కుండా తప్పించుకునేందుకే పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read More : మరో దారుణం : తాళ్లతో కట్టేసి భార్యపై భర్త అత్యాచారం