MP Raghurama Krishna Raju : ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండి, సీఎం జగన్కు ఎంపీ RRR మరో లేఖ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల హామీని నెరవేర్చలేదని, గ్రామ సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పశు సంవర్థక శాఖలో 6100 ఉద్యోగాలు, 18వేల టీచర్, 6వేల
MP Raghurama Krishna Raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల హామీని నెరవేర్చలేదని, గ్రామ సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పశు సంవర్థక శాఖలో 6100 ఉద్యోగాలు, 18వేల టీచర్, 6వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా మెగా డీఎస్సీని ఇంకా నిర్వహించ లేదుని ఎంపీ రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మూడు రోజులుగా సీఎం జగన్కు లేఖలు రాస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇవాళ కూడా లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల హామీ నెరవేరలేదని.. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ హామీతో ఎన్నికల సమయంలో నిరుద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు. ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురు చూశారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని ఎంపీ లేఖలో కోరారు.
కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భర్తీ చేయకుండా వదిలేశారని.. వందల సంఖ్యలో సెక్రటేరియల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మూడు వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. కోర్టులో కేసుల కారణంగా అంతంత మాత్రమే భర్తీ అయ్యాయని చెప్పారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. అత్యవసరంగా పరిగణించి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.