ఏపీలో మరో ఎన్నికల సమరం.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో మరో ఎన్నికల సమరం.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నకలకు ఏపీ ఎస్‌ఈసీ సిద్ధమైంది. మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మార్చి 10వ తేదీన పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు విడుదల చేసింది. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయించారు. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది.

మార్చిన 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. గతేడాది మార్చి 23వ తేదీన నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా 15వ తేదీకి వాయిదా పడ్డాయి. 12నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

ఉపసంహరణ దశలో అప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు.. రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.