బాబాయ్ ఆస్తి కోసం కిరాతకం, తమ్ముళ్లకు చాక్లెట్ల ఆశ చూపి కిడ్నాప్ హత్య, అనంతలో దారుణం

  • Published By: naveen ,Published On : October 8, 2020 / 11:43 AM IST
బాబాయ్ ఆస్తి కోసం కిరాతకం, తమ్ముళ్లకు చాక్లెట్ల ఆశ చూపి కిడ్నాప్ హత్య, అనంతలో దారుణం

murder for assets: అనంతపురం జిల్లా గార్లదిన్నె కిడ్నాప్‌ కేసులో విషాదం నెలకొంది. ఇద్దరిలో ఒక చిన్నారి మృతి చెందాడు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెద్దనాన్న కొడుకే ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాకెట్లు ఆశ చూపి పిల్లలను తీసుకెళ్లిన పెద్దనాన్న కొడుకు.. వారిని జీడిపల్లి రిజర్వాయర్‌లో పడేసినట్లు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఓ చిన్నారి మృతి, ఆసుపత్రిలో మరో బాబు:
గార్లదిన్నె మండలం మర్తాడులో శ్రీనివాసులు, సుజాత దంపతుల కుమారులు కిడ్నాప్‌‌నకు గురయ్యారు. ఇద్దరినీ హతమార్చేందుకు సమీప బంధువు రాము యత్నించాడు. కొనఊపిరితో ఉన్న శిశిధర్‌(6)ను పోలీసులు కాపాడారు. కాగా, రిజర్వాయర్ లో పడేసి మోక్షజ్ఞ(3)ను రాము చంపేశాడు. నిందితుడు రామును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

murder

అక్టోబర్ 7 : చిన్నాన్న పిల్లలు మోక్షజ్ఞ, శశిధర్‌లను చాక్లెట్లు ఇస్తానని తీసుకెళ్లిన రాము
అక్టోబర్ 7 : చిన్నారులను జీడిపల్లి రిజర్వాయర్‌లో పడేసిన రాము
అక్టోబర్ 8 : కాలువలో కొట్టుకుపోతున్న పిల్లలను గుర్తించిన స్థానికులు
అక్టోబర్ 8 : హంద్రీనీవా కాలువలో శవమై తేలిన మోక్షజ్ఞ
అక్టోబర్ 8 : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శశిధర్

చాక్లెట్లు ఇస్తానని తీసుకెళ్లి:
బాబాయ్ ఆస్తి కోసం రాము ఈ దారుణానికి ఒడిగట్టాడు. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన రాము తన బాబాయి ఇద్దరు కొడుకుల్ని పిలిచాడు. చాక్లెట్లు కొనిస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. పిల్లలు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అనుమానంతో రాముని ప్రశ్నించగా.. ఇద్దరు పిల్లల్ని రాళ్లతో కొట్టి కాలువలో తోసేసినట్లు ఒప్పుకున్నాడు.

10 ఎకరాల పొలం తనకే వస్తుందని:
ఆస్తి కోసమే ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు రాము చెప్పాడు. ఇద్దరు పిల్లలు చనిపోతే బాబాయి వాటా కింద ఉన్న 10 ఎకరాల పొలం తనకే వస్తుందన్న ఆశతో ఈ హత్య చేసినట్లు తేలింది. రాముని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గుండె పగిలేలా రోదించారు. ఆస్తి కోసం వరుసకు అన్న అయ్యే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.