Nadendla Manohar : విశాఖలో మంత్రులు జోగి రమేశ్, రోజా కాన్వాయ్పై దాడి.. వైసీపీ కుట్ర అని జనసేన ఎదురుదాడి
పవన్ విశాఖ పర్యటన, జనవాణిపై ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే వైసీపీ నాయకులు దాడి నాటకం ఆడారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
Nadendla Manohar : విశాఖలో మంత్రుల కాన్వాయ్ పై దాడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికి జనసేన కార్యకర్తల పనే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మేుము తలుచుకుంటే పవన్ కల్యాణ్ ఎక్కడా తిరగలేరని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనికి పూర్తి బాధ్యత పవన్ కల్యాణ్ వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల విమర్శలు, ఆరోపణలపై జనసేన నాయకులు ఘాటుగా బదులిచ్చారు. మంత్రుల కాన్వాయ్ పై దాడిని వైసీపీ కుట్రగా అభివర్ణించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ కొత్త నాటకానికి తెరతీసిందని ఎదురుదాడికి దిగారు.
మంత్రుల కాన్వాయ్ పై దాడి ఘటనపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. వైసీపీ నాయకులపై ఎదురుదాడికి దిగారు. పవన్ విశాఖ పర్యటన, జనవాణిపై ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే వైసీపీ నాయకులు దాడి నాటకం ఆడారని ఆయన ఆరోపించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
మంత్రుల కాన్వాయ్ పై జనసైనికులు దాడి చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రుల కాన్వాయ్ పై దాడి జరిగిందని, జనసైనికులే చేశారని పోలీసులు ఎక్కడా నిర్ధారించలేదన్నారు నాదెండ్ల. అలాంటప్పుడు తమపై బురదజల్లడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులపై దాడి జరిగితే వారికి రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అలా జరిగుంటే అది పోలీసుల వైఫల్యమే అన్నారు నాదెండ్ల.
విశాఖ గర్జనకు హాజరైన సుబ్బారెడ్డి, రోజా, జోగి రమేశ్, పేర్ని నాని కార్యక్రమాన్ని ముగించుకుని శనివారం సాయంత్రం ఎయిర్పోర్టుకు బయలుదేరారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్కు స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నేతల కార్లు కనిపించడంతో కర్రలు, రాళ్లతో జనసైనికులు దాడికి దిగారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ దాడితో విశాఖలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.