Gannavaram Constituency: తెలుగుదేశం పార్టీ అధిష్టానం గన్నవరం నియోజకవర్గంపై దృష్టిపెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెక్పెట్టే దిశగా ఆ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. యువగళం పాదయాత్ర మంగళవారం 191వ రోజుకు చేరుకుంది. గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా ఇవాళ లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. ఈ బహిరంగ సభను స్థానిక టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభను విజయవంతం చేయడంకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరంలో నారా లోకేశ్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. బహిరంగ సభను విజయవంతం చేయండం ద్వారా నియోజకవర్గంలో టీడీపీ సత్తాను చాటేందుకు ఆ పార్టీ నేతలు దృష్టిపెట్టారు.
2009 నుంచి గన్నవరం నియోజకవర్గంలో వరుస విజయాలతో టీడీపీ హ్యాట్రిక్ సాధించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీడీపీకి వ్యతిరేఖ పవనాలు వీచినా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా వంశీ విజయం సాధించారు. ఆ తరువాత కొద్దికాలంకే వంశీ టీడీపీని వీడి వైసీపీ సానుభూతి పరుడిగాకొనసాగుతున్నారు. టీడీపీని వీడిన నాటినుంచి నారా లోకేశ్, చంద్రబాబు లక్ష్యంగా వంశీ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నారా చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్దరచ్చకు దారితీసింది. అప్పటి నుంచి టీడీపీ శ్రేణులు వంశీపై మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పట్టుదలతో ఉన్నారు. ఈక్రమంలో ఇవాళ నిర్వహించే బహిరంగ సభను టీడీపీ అధిష్టానంతో పాటు స్థానిక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికితోడు ఇన్నాళ్లు వైసీపీలో కొనసాగిన యార్లగడ్ల వెంకట్రావు ఆ పార్టీని వీడి తాజాగా టీడీపీలో చేరడం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటుంది.
యార్లగడ్డ టీడీపీలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది. అయితే, గత రెండు రోజుల క్రితం యార్లగడ్డ చంద్రబాబుతో భేటీ అయిన సమయంలో.. కొడాలి నానిపై గుడివాడ నియోజకవర్గంలోనైనా బరిలోకి దిగుతానని ప్రకటించారు. కానీ, గన్నవరం నియోజకవర్గంలోనే యార్లగడ్డను బరిలోకి దింపే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో జరిగే యువగళం పాదయాత్ర బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీపై లోకేశ్ ఆగ్రహంతో ఉన్నారు. పలు సందర్భాల్లో సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతానంటూ లోకేశ్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో జరిగే బహిరంగసభలో నారా లోకేశ్ వల్లభనేని వంశీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.