గంటకు 300మందికే అనుమతి, ఆధార్ మస్ట్, అన్నదానం ఉండదు.. ఆలయాల్లో దర్శనానికి కొత్త మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ 5.0 సడలింపుల్లో భాగంగా జూన్‌ 8 నుంచి ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతించిన సంగతి

  • Published By: naveen ,Published On : May 31, 2020 / 03:38 AM IST
గంటకు 300మందికే అనుమతి, ఆధార్ మస్ట్, అన్నదానం ఉండదు.. ఆలయాల్లో దర్శనానికి కొత్త మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ 5.0 సడలింపుల్లో భాగంగా జూన్‌ 8 నుంచి ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతించిన సంగతి

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5వ దశ అమలవుతుంది. కాగా, లాక్‌డౌన్‌ 5.0 సడలింపుల్లో భాగంగా జూన్‌ 8 నుంచి ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతించింది. జూన్‌ 8 నుంచి ఆలయాలు, ప్రార్ధనా స్థలాలు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా కారణంగా ఏపీలోని ఆలయాల్లో కొన్ని కొత్త నిబంధనలు పెట్టనున్నారని తెలుస్తోంది. భక్తుల క్షేమం దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు. దర్శనాల విషయంలో కీలక మార్పులు అమలు చేయనున్నారు.

గంటకు 300మందికే దర్శనానికి అనుమతి:
రాష్ట్రంలోని ఆలయాల్లో గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అది కూడా అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా కేవలం లఘు దర్శనానికే పరిమితం చేస్తారు. ఆలయాల్లో దర్శనాలకు అనుమతిస్తూ.. కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై దేవాదాయ శాఖ పలు మార్గదర్శకాలను రూపొందించి వైద్యారోగ్య శాఖ అనుమతి కోసం పంపింది. వైద్యారోగ్య శాఖ వీటిని ఆమోదించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. 

జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం:
కాగా, జూన్‌ 8 నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తెరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఐదో విడత లాక్‌డౌన్‌లో ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే దర్శనాలకు అనుమతించనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కరెంట్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌ ద్వారా టైమ్‌ స్లాట్‌ టిక్కెట్లు జారీ చేయనున్నారు. తిరుమలకు వచ్చేవారికి తప్పనిసరిగా మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి.  

ఆలయాల్లో దర్శనానికి మార్గదర్శకాలు:
* నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలు తదితర క్రతువులకు సంబంధించి గతంలో అనుమతించే భక్తుల సంఖ్యలో 30 శాతం మందినే అనుమతించాలి.
* కాటేజీల్లోని ఒక గదిలో ఇద్దరు బస చేసేందుకు మాత్రమే అనుమతివ్వాలి. ఒకదాన్ని వదిలి మరొకటి చొప్పున ఉన్నవాటిలో మొత్తం 50 శాతం గదులనే భక్తులకు కేటాయించాలి. 
* కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను ఒకదాన్ని విడిచి మరోటి తెరిచేందుకు అనుమతివ్వాలి. 
* అన్నదానం, నిత్యాన్నప్రసాదం ఉండదు. 
* ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతించొద్దు.
* ఆలయాల దర్శన సమయాలను స్థానిక పరిస్థితులను బట్టి కార్యనిర్వాహక అధికారులు నిర్ణయించాలి.
* భక్తులు ముందుగానే బుక్ చేసుకుంటే టైమ్ స్లాట్ కేటాయిస్తారు.
* దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడూ ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
* ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను ఒకదాన్ని విడిచి మరొకటి తెరిచేందుకు అనుమతివ్వాలి.