వైఎస్ జగన్ కీలక నిర్ణయం: మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు

  • Published By: vamsi ,Published On : October 20, 2019 / 02:07 PM IST
వైఎస్ జగన్ కీలక నిర్ణయం: మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు

ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం(20 అక్టోబర్ 2019) జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి జులై నెలలోనే ఇన్‌చార్జ్ మంత్రులను నియమించిన జగన్ సర్కారు ఇప్పుడు  12 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను మార్చింది. చిత్తూరు జిల్లాకు మాత్రం మేకపాటి గౌతమ్ రెడ్డినే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రిగా మేకపాటి పని చేస్తున్నారు. ఇక ఇన్‌చార్జ్ మంత్రుల జాబితాలో హోంమంత్రి మేకతోటి సుచరితకు ఇంతకుముందు నెల్లూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈసారి జాబితాలో ఆమె పేరు లేదు. ఆమె బదులు బాలినేని శ్రీనివాస రెడ్డికి నెల్లూరు జిల్లా బాధ్యతలను అప్పగించారు.

అలాగే ఆళ్ల నాని పేరు ఇంతకుముందు జాబితాలో ఉండగా.. ఆయనను తప్పించి కొడాలి నానికి అవకాశం ఇచ్చారు. అలాగే ఆదిమూలపు సురేశ్‌ను కడపకు నియమించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను తప్పించారు.

జిల్లాల వారీగా ఇంచార్జి మంత్రులు వీరే:

1 శ్రీకాకుళం కొడాలి వెంకటేశ్వరరావు(నాని)
2 విజయనగరం వెల్లంపల్లి శ్రీనివాస రావు
3  విశాఖపట్నం కురసాల కన్నబాబు
4 తూర్పుగోదావరి మోపిదేవి వెంకటరమణ
5 పశ్చిమ గోదావరి పేర్ని వెంకటరామయ్య(నాని)
6 కృష్ణా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
7  గుంటూరు చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
8 ప్రకాశం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
9 నెల్లూరు బాలినేని శ్రీనివాస రెడ్డి
10 కర్నూలు అనిల్ కుమార్ యాదవ్
11 కడప ఆదిమూలపు సురేశ్
12 అనంతపురం బొత్స సత్యనారాయణ
13 చిత్తూరు మేకపాటి గౌతమ్ రెడ్డి