నిమ్మగడ్డ రమేశ్ కేసు..అసలు ఏం జరిగింది ? పూర్తి వివరాలు

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 06:46 AM IST
నిమ్మగడ్డ రమేశ్ కేసు..అసలు ఏం జరిగింది ? పూర్తి వివరాలు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ తొలగింపు ఆర్డినెన్స్‌ను కోర్టు కొట్టివేసింది. 2020, మే 29వ తేదీ శుక్రవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలని ఆదేశం జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల కమిషనర్‌ నియామకంలో నిబంధనల మార్పు కుదరదని, ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చే అధికారం లేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత తరుణంలో తిరిగి రమేశ్ కుమార్..తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన అనంతరం ప్రభుత్వం స్పందిస్తుందని తెలుస్తోంది. 

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కేసుని ఒకసారి పరిశీలిస్తే.. సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా.. తనని పదవి నుంచి తొలగించారు అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టుని ఆశ్రయించారు. అలాగే ప్రభుత్వ ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ నిమ్మగడ్డతో పాటు మరో 11 మంది పిటీషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. 2020, ఏప్రిల్ 11న నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఎస్ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ పై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేపట్టింది హైకోర్టు. 2020, ఏప్రిల్ 13న విచారణ ప్రారంభించింది. అయితే..బాధితుడు నిమ్మగడ్డ నేరుగా కోర్టును ఆశ్రయించటంతో మిగిలిన పిటీషన్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వాదించింది. కానీ, ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కావటంతో తమ పిటీషన్లను కూడా పరిగణలోకి తీసుకొని వాదనలను వినాలని మిగిలిన వారు అభ్యర్ధించారు.

దీంతో అందరి పిటీషన్లను పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టింది. అయితే..ప్రభుత్వం మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే 2020, ఏప్రిల్ 18న కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయటంతో 2020, ఏప్రిల్ 20న విచారణ చేపట్టింది హైకోర్టు. అయితే..ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ఏప్రిల్ 18న దాఖలు చేసింది కేవలం ప్రాథమిక కౌంటర్ అని..పూర్తి స్థాయి కౌంటర్ కు గడువు కోరింది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు..తగిన సిబ్బంది లేరన్న ఏజీ వాదనను తప్పుబట్టింది. అయినా ఏజీ హోదాకు గౌరవం ఇస్తూ అదనపు కౌంటర్ దాఖలు చేయటానికి గడువు ఇచ్చింది. ఏప్రిల్ 24లోగా ప్రభుత్వం అడిషనల్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఏప్రిల్ 27లోగా పిటిషనర్లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ..విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.

ఏప్రిల్ 28న విచారణ చేపట్టడంతో..వాదనలు వినిపించిన పిటీషనర్లు ప్రభుత్వ ఆర్డినెన్స్ కేవలం కక్షసాధింపులో భాగమేనన్నారు. సర్వీస్ రూల్స్ నిబంధనల మేరకు ఎస్ఈసీ పదవీకి రాజ్యంగ రక్షణ ఉందన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ చెల్లదని వాదనలు వినిపించారు. అయితే..ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణలో స్వతంత్రత పెంచేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని..ఎన్నికల కమిషనర్ పై రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదనేది తమ అభిమతమని చెప్పుకొచ్చింది.

విచారణ సందర్భంలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పంచాయితీ రాజ్ శాఖ చట్టంలో మార్పులు మాత్రమే సూచిస్తుందని వ్యాఖ్యానించింది. మున్సిపల్ చట్టంలో మార్పులు చేయలేదు కదా అని ప్రశ్నించింది. అంటే మున్సిపల్ చట్టం ప్రకారం నిమ్మగడ్డ పదవీకాలం ఇంకా ముగిసి పోలేదు కదా అని ప్రశ్నించింది.

ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు 2020 మే 8వ తేదీన ముగిశాయి. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పు..తో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

Read: వ్యక్తులు శాశ్వతం కాదు.. రాజ్యాంగ వ్యవస్థలే శాశ్వతం: నిమ్మగడ్డ రమేష్ కుమార్