ముంచుకొస్తున్న గండం.. అతి తీవ్ర తుఫాన్‌గా నివార్.. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత

  • Published By: naveen ,Published On : November 25, 2020 / 03:05 PM IST
ముంచుకొస్తున్న గండం.. అతి తీవ్ర తుఫాన్‌గా నివార్.. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత

severe nivar cyclone : నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్‌గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు(నవంబర్ 26,2020) తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే నివార్‌ తుఫాన్‌ ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై విరుచుకుపడుతోంది. కుండపోత వర్షాలతో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ హెచ్చరికలతో ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. NDRF బృందాలనూ రంగంలోకి దింపి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై నివార్‌ తీవ్ర ప్రభావం:
ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై నివార్‌ తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ(నవంబర్ 25,2020) కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక రేపు(నవంబర్ 26,2020), ఎల్లుండి(27,2020) కూడా నివార్‌ ప్రతాపం చూపనుంది.

నెల్లూరు జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు:
తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో ఏపీ తీర ప్రాంతాలలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా నెల్లూరు జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లా ఎమర్జెన్సీ సెంటర్‌తోపాటు అన్ని డివిజన్‌ కార్యాలయాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
https://10tv.in/cyclone-nivar-to-hit-tamil-nadu-puducherry-at-145-kmph-after-midnight/
తమిళనాడులో భారీ వర్షం:
ఇప్పటికే తుఫాన్‌ తమిళనాడుపై విరుచుకుపడుతోంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. కడలూరు, విల్లుపురం, నాగపట్టినం, తంజావూరు, నామక్కల్‌,
పెరంబలూరు జిల్లాల్లోనూ కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో ఇవాళ తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుఫాన్‌ ఎఫెక్ట్‌తో పుదుచ్చేరిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు.

ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం 22 బృందాలు:
నివార్‌ తుఫానును ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు 22 సహాయక బృందాలను తుఫాన్‌ ప్రభావిత రాష్ట్రాలకు పంపింది. అత్యవసరాల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రగంలోకి దింపింది. ఈ బృందాలన్నింటి దగ్గర వైర్‌లెస్‌, ఉపగ్రహ సమాచార మార్పిడి సిస్టంతోపాటు, ట్రీ కట్టర్లు, పోల్‌ కట్టర్లు కూడా సిద్ధంగా ఉంచినట్లు హోంశాఖ తెలిపింది. తుఫాను తర్వాత పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది.

చెన్నై ఎయిర్ పోర్టుకు రావాల్సిన 12 విమానాలు రద్దు:
నివార్ తుపాను ప్రభావం చెన్నై నగరంపై తీవ్రంగా ఉంది. దీంతో.. చెన్నై విమానాశ్రయానికి రావాల్సిన 12 విమానాలను రద్దు చేశారు. అలాగే.. చెన్నై నుంచి వెళ్లాల్సిన 12 విమానాలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.