కవాతు లేనట్లే : ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్

  • Published By: madhu ,Published On : January 11, 2020 / 09:08 AM IST
కవాతు లేనట్లే : ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్

జనసేనానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. 2020, జనవరి 11వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలో నుంచే లేచి వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లడం..కేంద్ర పెద్దల అపాయింట్ మెంట్ దొరకడమే కారణమని జననేన శ్రేణులు చెబుతున్నాయి. రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని పవన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నేరుగా హస్తినకే పయనం కావడం విశేషం. 

రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలపై జనసేనానీ మంగళగిరికి చేరుకుని కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో భేటీలు జరిపారు. తర్వాత అమరావతి రాజధానికి చెందిన కొంతమందితో సమావేశమయ్యారు. పరిస్థితులపై ఆరా తీశారు. రాజధాని రైతులకు అండగా ఉంటానని, కేంద్రంతో కూడా ఈ అంశంపై చర్చిస్తానని పవన్ హామీనిచ్చారు. 

2020, జనవరి 11వ తేదీ శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. రాజధానిలో కవాతు నిర్వహించడంపై పవన్ క్లారిటీ ఇచ్చారు. స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చాకే…భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. సమావేశంలో రాజధాని, స్థానిక ఎన్నికలపై చర్చించారు. ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకుండా..ప్రత్యక్ష కార్యాచరణ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పవన్ వెల్లడించారు.

టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కొందరు..ఒంటరిగానే పోటీ చేయాలని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే నిర్ణయాన్ని మాత్రం పవన్‌కే వదిలేశారు. సమావేశం మధ్యలోనే పవన్ లేచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరి ఆయన అక్కడ ఎవరెవరితో భేటీలు జరుపుతారో చూడాలి. 

Read More : ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..రాజధానిపై కీలక ప్రకటన