బెయిల్ వచ్చింది..అంతలోనే అరెస్టు అయిన నూతన్ నాయుడు భార్య
Nutan naidu wife priya madhuri : బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, నటుడు, దర్శకుడు నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురికి బెయిల్ వచ్చిందన్న సంతోషం కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది. 2020, అక్టోబర్ 08వ తేదీ గురువారం బెయిల్ పై బయటకు వచ్చారు. కొద్దిసేపటికే పెందుర్తి పోలీసులు చేరుకుని చీటింగ్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించి మరలా జైలుకు తరలించారు.
విశాఖ లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నూతన్నాయుడు దంపతులు తనను మోసం చేశారని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్ద సుమారు రూ.25 లక్షలు వసూలు చేశారని, రెండేళ్లుగా ఉద్యోగం కోసం అడుగుతున్నా ప్రియామాధురి పట్టించుకోలేదని తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసి ఆమెను గురువారం అరెస్ట్ చేసినట్లు సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు.
కొద్ది రోజుల క్రితం దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో నూతన్ నాయుడు భార్యను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు అరెస్ట్ చేశారు. నూతన నాయుడు భార్య మధుప్రియ తనకు శిరోముండనం చేయించారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా మధుప్రియపై ఏ 1గా కేసు నమోదు చేసిన పోలీసులు నూతన్ నాయుడు ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా పేర్కొన్నారు.
శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నూతన్ నాయుడు భార్య మధుప్రియపై ఏ 1గా కేసు నమోదు చేశారు. అలాగే నూతన్ నాయుడు సిబ్బంది వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307, 342, 323, 506, R/W 341PC, 3(1)B ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.