పోలీసుకే టోకరా..ట్రాఫిక్ ఎస్సై పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా
సాధారణ ప్రజల పేరుతోనో, సెలబ్రిటీల పేరుతోనో, లేదా వారి బంధువులు లాగా సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు సృష్టించి సైబర్ నేరగాళ్లు మోసం చేయటం మనం ఇన్నాళ్లూ చూస్తూ ఉన్నాం. కానీ పోలీసు అధికారి పేరుతోనే ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచి అతని ఫ్రెండ్స్ , బంధువుల నుంచి డబ్బులు కొట్టేసిన వైనం విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. ట్రాఫిక్ ఎస్సై పేరుతో మెసెంజర్లో చాటింగ్ చేస్తూ…. అత్యవసరమంటూ సైబర్ నేరగాళ్లు లక్షల్లో దోచేసారు.
లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లకే పరిమిత మవుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన మెసెజ్లకు కనీసం వారికి ఫోన్ చేయకుండా ఏం ఇబ్బందుల్లో ఉన్నాడో ఏమో అనుకుంటూ కేవలం చాటింగ్ మాత్రమే చేస్తూ డబ్బులు కూడా ట్రాన్సఫర్ చేసేసి వాళ్లను ఆదుకుంటున్నారు. ఇదే అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు చివరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వారిని కూడా వదల్లేదు.
ఆపదంటే ఆదుకునే మనసున్న చాలామంది కరోనా లాక్ డౌన్ టైమ్ లో వాట్సప్ గ్రూపు్ల్లో సహాయం చేయమని వచ్చే అనేక మెసేజ్ లకు వీలైనంత వరకు తమకు తోచినంత సహాయం అందించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్తరకం పంథా మొదలెట్టేశారు.
ఫేస్బుక్లో పోలీసులు, లాయర్లు, వైద్యుల పేర్లతో కొత్తగా పేజీలు సృష్టించారు. అందులో ఉన్న వారికి ఫ్రెండ్స్ రిక్వెస్టులు పెట్టడం వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వారికి మెసెంజర్ ద్వారా అత్యవసరమంటూ రెండు, మూడు వేల రూపాయల సాయం చేయమని కోరడం జరుగుతోంది.
దీంతో చాలా మంది ఏదో అవసరం ఉంటుందులే… పర్సనల్ గా వెళ్లి ఇవ్వటం ఎందుకు ఈ కరోనా టైమ్ లో అనుకుని పేటీమ్, ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించేస్తున్నారు. ఈ కోవలోనే చాలా మంది పోలీస్ అధికారులు కూడా బలయ్యారు. రూ. లక్షల్లో సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
విజయనగరం ట్రాఫిక్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న హరి పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ ఖాతా ప్రారంభించారు. అతని మిత్రులందరినీ నకిలీ ఖాతాలో యాడ్ చేసుకుని వారితో మెసెంజర్ ద్వారా చాట్ చేశారు.
అర్జెంట్గా అవసరం ఉందని.. గంటలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ స్నేహితులకు మెసేజ్లు పంపించడంతో చాలా మంది ఫోన్పే, పేటీఎంల ద్వారా డబ్బలు ట్రాన్సఫర్ చేశారు.
ఇలా పంపించే క్రమంలో ఎస్సై హరి స్నేహితుడికి ఒకరికి ఫోన్ పేలో పేరు సరిగా లేదని అనుమానం వచ్చింది. వెంటనే ఎస్సై హరికే నేరుగా ఫోన్ చేయడంతో ఆయన అవాక్కయ్యారు. హరి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమందించి, ఆ ఖాతాను బ్లాక్ చేయించారు. ఎవ్వరూ డబ్బులు వేయవద్దని వాట్సాప్ ద్వారా మిత్రులందరికీ మెసెజ్లు పెట్టారు.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.