విగ్రహాల ధ్వంసం రాజకీయం : డీజీపీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఫైర్

విగ్రహాల ధ్వంసం రాజకీయం : డీజీపీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఫైర్

AP DGP comments : ఏపీ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం అంశం మరోసారి రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది.. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.. అయితే విపక్షాలకు ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు వైసీపీ నేతలు.. దీంతో ఏపీలో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనల్లో రాజకీయ పార్టీల కుట్ర ఉందన్న డీజీపీ వ్యాఖ్యలపై.. ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా స్పందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఆలయాలపై దాడులకు రాజకీయాలకు సంబంధం లేదని.. ఉన్మాదుల పని, పిచ్చోళ్ల పనిగా భోగి రోజున డీజీపీనే చెప్పారని.. ఇప్పుడు అదే డీజీపీ మాట మార్చి దాడులను ప్రతిపక్షాలకు అంటగడుతున్నారని విమర్శించారు. సజ్జల స్క్రిప్ట్‌, జగన్‌ డైరెక్షన్‌లో డీజీపీ యాక్షన్‌ చేస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ, బీజేపీ నేతల కామెంట్స్ : –
ఎవరి మెప్పు కోసమో.. డీజీపీ అన్యాయం అయిపోతున్నారని టీడీపీ సీనియర్‌ నేతల వర్ల రామయ్య ఆరోపించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఫైర్‌ అయ్యారు. విగ్రహాల ధ్వంసం కేసులో గందరగోళ ప్రకటన చేశారంటూ డీజీపీకి లేఖ రాశారు. ఆలయాలపై దాడుల్లో బీజేపీ కార్యకర్తల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వకపోతే.. పరువునష్టం దావా వేస్తామన్నారు సోము వీర్రాజు. డీజీపీ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని అలాగే మరో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని హితవుపలికారు సోమువీర్రాజు.

వైసీపీ కౌంటర్ :-
టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై వైసీపీ ధీటుగా కౌంటరిచ్చింది. చంద్రబాబు 14 ఏళ్ల పాలన అందరికీ తెలుసని.. విజయవాడలో నలబైకి పైగా ఆలయాలు కూల్చిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి అనిల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దేవాలయాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో ఆలయాల కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి.. త్వరలో రానున్న తిరుపతి ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీల నేతలు మరోసారి దేవాలయాలపై దాడులను తెరపైకి తీసుకొస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.