కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి, అసలేం జరిగింది..

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి, అసలేం జరిగింది..

palasa volunteer lalitha dies after taking corona vaccine: శ్రీకాకుళం జిల్లా పలాసలో విషాదం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 5న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలాస వాలంటీర్ లలిత(28) తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ తో మరణించడం కలకలం రేపింది. టీకా తీసుకున్న తర్వాత ఆమెకు జ్వరం, తలనొప్పి వచ్చాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న మరికొంత మందిలో కూడా దుష్ప్రభావాలు కనిపించాయన్నారు. వారిని చికిత్స నిమిత్తం తరలించినా, లలిత పరిస్థితి విషమించిందన్నారు. దీంతో లలిత ఆదివారం(ఫిబ్రవరి 7,2021) కన్నుమూసింది.

లలిత మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీకా వికటించడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు. పలాస మండలం రెంటికోటకు చెందిన 8 మంది వాలంటీర్లతో పాటు వీఆర్వో ప్రసాద్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరందరిలోనూ స్వల్ప జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అందరూ ఇంట్లోనే ఉండి ట్యాబ్లెట్లు వేసుకున్నారు. అయితే, లలిత పరిస్థితి మాత్రం విషమించిందని తహసీల్దారు మధుసూదనరావు తెలిపారు. లలిత మృతితో తీవ్ర ఆందోళనకు గురైన ఇతర వాలంటీర్లను, వీఆర్వోను పలాస పీహచ్ కి తరలించారు.

దీనిపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. లలిత కుటుంబీకులకు ఆయన ధైర్యం చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 2 లక్షలు అందిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తన బిడ్డకు ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేవని, టీకా తీసుకున్న తర్వాత జ్వరం వచ్చిందని, పారాసిటమాల్ వేసుకోవాలని మెడికల్ సిబ్బంది చెప్పారని లలిత తల్లి పార్వతి తెలిపారు. టీకా దుష్ప్రభావంతోనే తాము బిడ్డను కోల్పోయామని భోరున విలపించారు.

రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాతే లలిత మృతికి అసలు కారణం తెలుస్తుందని పలాస తహసీల్దారు తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత వాలంటీర్ చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.