Pawan Kalyan: పవన్ కుమార్ మృతి తనను చాలా బాధించింది.. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి
బయట ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళుతున్న పోలీస్ సిబ్బందికి భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటున్నాయి? అనే విషయంపై ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో మదింపు జరగవలసి ఉంది.

Pawan Kalyan
JanaSena Party Chief : అమరావతిలో ఆర్-5 జోన్లో బందోబస్తు విధుల్లో ప్రకాశం జిల్లా దర్శి కానిస్టేబుల్ పవన్ కుమార్ పాల్గొన్నాడు. విధి నిర్వహణ అనంతరం తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తుండగా కట్ల పాము కాటు వేసింది. తోటి కానిస్టేబుళ్లు అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పవన్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పాము కాటుతో కానిస్టేబుల్ మృతి చెందడం తనను చాలా బాధించిందని అన్నారు. ఈ మేరకు ప్రెస్నోట్ విడుదల చేశారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో పాము కాటుకు గురై కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. బందోబస్తుకోసం వచ్చి పాము కాటుతో పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసి చాలా బాధనిపించిందని పవన్ తెలిపారు. బందోబస్తుకోసం వచ్చినవారు ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. డ్యూటీలో ఉన్నవారికి వసతులు లేమిఉన్న విషయం ఈ సంఘటన తేటతెల్లం చేస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు.
Pawan Kalyan : అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణంపై సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు
బయట ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళుతున్న పోలీస్ సిబ్బందికి భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటున్నాయి? అనే విషయంపై ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో మదింపు జరగవలసి ఉంది. వారికి తగిన వసతులు ఏర్పాటు చేయవలసి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన పవన్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పవన్ కుమార్ కుటుంబానికి తగినంత నష్టపరిహారం తక్షణం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.
పాము కాటుతో కానిస్టేబుల్ మృతి చెందడం బాధాకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/oXdq0dRG6j
— JanaSena Party (@JanaSenaParty) May 26, 2023