మీసం మెలేసి చెబుతున్నా ”పవన్” పాలకొల్లు నాయుడు

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 02:17 PM IST
మీసం మెలేసి చెబుతున్నా ”పవన్” పాలకొల్లు నాయుడు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో విడుదల చేసింది. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు టీడీపీ నేతలు ఘాటుగా బదులిచ్చారు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ నేతలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు.

ఇక జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు. పవన్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారు.. మరి.. మీరెవరు.. జగన్ పెంపుడు కుక్కలా? అని ప్రశ్నించారు. అసలు పవన్ పేరు ఎత్తే అర్హత మీకుందా? అని వైసీపీ నేతలను నిలదీశారు. పవన్ ని పవన్ నాయుడు, దత్తపుత్రుడు అంటారా? అని మండిపడ్డారు. మీసం మెలేసి చెబుతున్నా… పవన్ పాలకొల్లు నాయుడు అని బోండా ఉమ అన్నారు. మీకేమైనా డౌట్ ఉంటే డీఎన్ఏ చెక్ చేసుకోవాలన్నారు.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బోండా ఉమ అన్నారు. అసలు ప్రభుత్వంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఉండదన్నారు. ఇన్ సైడర్ చట్టం దేనికి వర్తిస్తుందో అంబటి రాంబాబు తెలుసుకోవాలన్నారు. కంపెనీ సమాచారాన్ని డైరెక్టర్లు లీక్ చేస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగినవన్నీ టీడీపీకి అంటగడుతున్నారని బోండా ఉమ మండిపడ్డారు. 5 చోట్ల భూముల కొనుగోలుకు 2013లోనే హెరిటేజ్ బోర్డు నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై చర్చకు సిద్ధమా అని వైసీపీకి సవాల్ విసిరారు. మొత్తంగా అమరావతి భూములు వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య వివాదం ముదురుతోంది.