కృష్ణా జిల్లాలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా, డబ్బాలు నింపుకున్న జనాలు, ఏదైనా జరిగి ఉంటే..

  • Published By: veegamteam ,Published On : June 28, 2020 / 08:08 PM IST
కృష్ణా జిల్లాలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా, డబ్బాలు నింపుకున్న జనాలు, ఏదైనా జరిగి ఉంటే..

కృష్ణా జిల్లా గన్నవరం హైవేపై ప్రమాదం జరిగింది. పెట్రోల్, డీజిల్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే డబ్బాలతో అక్కడికి చేరుకున్నారు. వృథాగా కారిపోతున్న పెట్రోల్ ను డబ్బాల్లో నింపుకుని ఇంటికి వెళ్లారు. పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడిన విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డబ్బాల్లో పెట్రోల్ పట్టుకునేందుకు పోటీలు:
కాగా ట్యాంకర్ బోల్తాపడి పెట్రోల్ లీక్ కావడంతో ఏం జరుగుతుందోనని ఫైర్ సిబ్బంది, పోలీసులు బాగా భయపడ్డారు. జనాలు మాత్రం డబ్బాల్లో పెట్రోల్ నింపుకోవడానికి పోటీలు పడ్డారు. స్థానికుల తీరు ఫైర్ సిబ్బందిని, పోలీసులను మరింత టెన్షన్ కు గురి చేసింది. పెట్రోల్ ఎంత ప్రమాదమో తెలిసిందే. వారు డబ్బాలతో పెట్రోల్ పట్టుకునే క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే, ఊహించని స్థాయిలో ప్రమాదం ఉంటుంది.

ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే:
బైక్ ని తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో ట్యాంకర్ బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. ఆ ట్యాంకర్ లో పెట్రోల్ తో పాటు డీజిల్ కూడా ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ట్యాంకర్ ను రోడ్డుపై నుంచి పక్కకు జరిపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కపోవడంతో స్థానికులు సహా అంతా ఊపిరిపీల్చుకున్నారు. డబ్బాల్లో పెట్రోల్ పట్టుకుని వెళ్తున్న స్థానికులను ముందుగా అదుపు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ట్యాంకర్ ను పక్కకి జరిపించారు. ఆ సమయంలో ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరక్కపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల తీరుపై పోలీసులు మండిపడ్డారు. ప్రమాదం అని తెలిసినా డబ్బాలతో పెట్రోల్ పట్టుకునేందుకు పోటీలు పడటాన్ని తప్పుపట్టారు. పొరపాటున నిప్పు రాజుకుని ఉంటే, బ్లాస్ట్ జరిగి ఉంటే ఘోరం జరిగి ఉండేదన్నారు.