విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం

  • Published By: bheemraj ,Published On : July 15, 2020 / 12:18 AM IST
విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం

విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం అయింది. రసాయనాలు కలపడంలో సమతుల్యత పాటించకపోవడం, రియాక్టర్ నిర్మాణాలు పాటించకపోవడం, రియాక్టర్ నిర్వహణలో ప్రమాణాలు పాటించకపోవడం, రియాక్టర్ వ్యాక్యూమ్ ప్రెసర్ విపరీతంగా పెరిగిపోవడమే విశాఖ సాల్వింట్ కంపెనీలో ప్రమాదానికి కారణమని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది. ప్రమాదంపై ఏర్పాటు అయిన ఐదుగురు సభ్యుల కమిటీ ఘటనకు సంబంధించి నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్ చందుకు సమర్పించింది. ఎస్ఎస్ ఆర్ 102 రియాక్టర్ లో ఒక్కసారిగా ఉష్ణగ్రతలు పెరిగాయి.

వాక్యూమ్ ప్రెజర్ పెరగడంతో దాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని కమిటీ పేర్కొంది. ప్రెజర్ నియంత్రించడంలో రెండు షిప్టుల్లోని కెమిస్టులు విఫలమయ్యారని తెలిపారు. రసాయనాలను కలపడంలో సమతుల్యం పాటించలేదని తెలిపింది. 75 నుంచి 90 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే ప్రమాదానికి కారణమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం సమర్థవంతంగా వ్యవహరించలేదన్నారు. కెమిస్ట్ శ్రీనివాస్ ప్లాంట్ లో చనిపోయినా యాజమాన్యం గుర్తించి సమాధానం ఇవ్వలేకపోయింది.

రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రాంకీ CETP సంస్థ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో నలుగురు మాత్రమే డ్యూటీ చేస్తున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. వీరిలో మల్లేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారని, ఇతడిని రాత్రి 12 గంటల సమయంలో గాజువాకలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ఇక మిగిలిన ముగ్గురుకు స్వల్ప గాయలు మాత్రమే అయ్యాయని తెలిపారు. ఇక్కడ ఉన్న ఈ సంస్థ రసాయనాల్ని శుద్ధి చేసి పలు ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. భారీ ఎత్తున రసాయనాల నిల్వ ఉండడమే ప్రమాద తీవ్రతకు కారణమని పలువురు భావిస్తున్నారు.

అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉండడం..భారీ ఎత్తున శబ్దాలు రావడంతో ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కంపెనీలో ఉన్న కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. బయటకు పరుగులు తీశారు. శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల వరకు వినిపించాయని, మంటలు 30 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.

ప్రమాదం విషయం తెలుసుకున్న పలు ఫార్మా సంస్థల్లో రాత్రి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులు భయంతో పరుగులు తీశారు. నల్లటి పొగలు దట్టంగా అలుముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుండడంతో…పలువురు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.