Private Hospitals : ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా దందా.. రెమ్డెసివిర్కు రూ.18 వేలు, ఐసీయూకు రూ.40 వేలు
కాసుల కక్కుర్తే ముఖ్యం.. దోచుకోవడమే లక్ష్యం.. కాసులుంటేనే వైద్యం.. కరోనా అని వస్తే చాలు.. వాళ్లే వారికి క్యాష్బ్యాంక్. కడపలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా దోపిడీ షురూ చేశాయి.
Private hospitals corona treatment : కాసుల కక్కుర్తే ముఖ్యం.. దోచుకోవడమే లక్ష్యం.. కాసులుంటేనే వైద్యం.. కరోనా అని వస్తే చాలు.. వాళ్లే వారికి క్యాష్బ్యాంక్. ఇప్పుడు ఇదే తీరుగా కరోనా దోపిడీ షురూ చేశాయి కడపలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్. పైసలుంటేనే ట్రీట్మెంట్ చేస్తామంటూ తెగేసి చెబుతున్నాయి. కరోనా వైరస్ బాధితులు ఆసుపత్రుల్లో ఉన్న రోజులను బట్టి ఫీజులు గుంజుతున్నాయి. వైరస్ అని అడ్మిట్ అయితే చాలు.. ప్రైవేట్ హాస్పిటల్స్ అందినకాడికి దోచుకుంటున్నాయి.
కడపలో కోవిడ్ పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటల్స్ నిలువునా దోచేస్తున్నాయి. కరోనా బాధితుల నుంచి లక్షలు వసూలు చేస్తూ.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీలోనే కరోనా ట్రీట్మెంట్ అందించాలని చెబుతున్నా.. అవేమీ ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలుకావడం లేదంటున్నారు బాధితులు.
రెమ్డెసివిర్ ఇంజక్షన్ వేయాలంటే అక్షరాలా 18 వేలు.. ఐసీయూలో ఉండాలంటే రోజుకు 40 వేలు.. ఆక్సిజన్ అందించాలన్నా రోజుకు 20 నుంచి 25 వేలను ముక్కు పిండి మరీ కరోనా పేషెంట్ల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల డెబిట్ క్రెడిట్ కార్డులతో కాకుండా నగదు మాత్రమే ఇవ్వాలంటున్నారు.
పలు జిల్లాల్లో వీటి ఆగడాలను అరికట్టలేక.. అధికారులు మౌనం దాలుస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోబోతే.. ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో ఆగిపోతున్నారు. దీంతో ఫీజుల దోపిడీకి అదుపు లేకుండా పోతోంది. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి.. ఇలా పలుచోట్ల ఫీజులను భారీగా వసూలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా సోకగా, ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రజాప్రతినిధి జోక్యంతో ఫీజులో కొంత రాయితీ ఇచ్చారు. ఇలా మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయి.