తెలుగు రాష్ట్రాల్లో 20 రూట్లలో ప్రైవేటు రైళ్లు.. మార్గాలు, ప్రయాణ సమయం వివరాలు

  • Published By: naveen ,Published On : July 6, 2020 / 12:02 PM IST
తెలుగు రాష్ట్రాల్లో 20 రూట్లలో ప్రైవేటు రైళ్లు.. మార్గాలు, ప్రయాణ సమయం వివరాలు

భారత్‌లోనూ రైల్వేల ప్రైవేటీకరణకు తెరలేచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ భారతీయ రైల్వే ‘ఆర్‌ఎఫ్‌క్యూ(రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’-RFQ) ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అన్నీ సవ్యంగా జరిగితే మరో మూడేళ్లలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

20 మార్గాల్లో ప్రైవేట్ రైళ్లు, అత్యధిక భాగం సికింద్రాబాద్ నుంచే:
కాగా, తెలుగు రాష్ట్రాల్లో 20 రూట్లలో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. వీటిలో అత్యధిక భాగం సికింద్రాబాద్ నుండి ప్రారంభమయ్యేవి ఉన్నాయి. రైల్వేశాఖ జారీ చేసిన అభ్యర్థన (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్- RFQ)లో ఈ విషయం తెలిపింది. రైళ్ల ప్రైవేటీకరణలో నిజానికి ఈ ప్రక్రియే అత్యంత కీలకమైనది. లాభదాయకమైన రూటు కాకపోతే రైళ్ల నిర్వహణకు ప్రైవేటు ఆపరేటర్ ముందుకు వచ్చే అవకాశమే లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ప్రైవేటు ఆపరేటర్ల కోసం దేశవ్యాప్తంగా 109 జతల రూట్లను గుర్తించింది. వీటిలో ఏపీ-తెలంగాణల్లో 20 ఉన్నాయి. దీనికోసం ప్రస్తుతమున్న భారతీయ రైల్వే వ్యవస్థను 12 క్లస్టర్లుగా కేంద్రం విభజించింది. క్లస్టర్ల వారీగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాల్సిన రూట్లను గుర్తించింది.

క్లస్టర్లు ఇవి:
* దేశంలోని రైల్వే నెట్‌వర్క్ ను మొత్తం 12 క్లస్టర్లుగా విభజణ.
* వీటిలోని 109 మార్గాల్లో 218 ప్రైవేటు రైళ్లను నడిపించాలనే ప్రతిపాదనలు.
* వీటికి కేవలం గార్డ్, డ్రైవర్‌‌లను మాత్రమే భారతీయ రైల్వే అందించనుంది.
ముంబైని రెండు క్లస్టర్లుగా రైల్వేశాఖ గుర్తించింది. మొదటి క్లస్టర్ లో 16 రూట్లు, రెండో క్లస్టర్ లో 23 రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించనున్నారు. అదే విధంగా ఢిల్లీ-1 క్లస్టర్ లో 14, ఢిల్లీ-2 క్లస్టర్ లో 12, చండీగడ్ క్లస్టర్ లో 17, హౌరాలో 22, పాట్నాలో 20 రూట్లను ప్రైవేటుకు అప్పగించనున్నట్లు రైల్వే శాఖ నోటిఫికేషన్ లో తెలిపింది. ప్రయాగ్ రాజ్ క్లస్టర్ లో 26, సికింద్రాబాద్ లో 20, జైపూర్ క్లస్టర్ లో 18, బెంగళూరులో 10 రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించనున్నారు.

కండీషన్లు:
* గంటకు కనీసం 160 కిమీ వేగంతో ప్రయాణం చేసేలా రైళ్లను రూపొందించాలని ప్రైవేట్ ఆపరేటర్లకు కేంద్ర ప్రభుత్వం షరతు.
* దీంతో పాటు ఆ మార్గంలో అప్పటివరకు నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు కన్నా ఎక్కువ వేగంతో ప్రైవేటు రైలు తిరగాలి.
* టికెట్ ధర నిర్ణయంతో పాటు ఆహారం, దుప్పట్ల సరఫరా, పరిశుభ్రతను ప్రైవేటు ఆపరేటర్లే చూసుకోవాలి.
* డ్రైవర్, గార్డులను మాత్రం రైల్వే శాఖ నియమిస్తుంది. వీరు రైల్వే శాఖ ఉద్యోగులుగానే ఉంటారు.
* మిగిలిన నిర్వహణ బాధ్యతలన్నీ ప్రైవేటు వారే చూసుకోవాలి. అయితే, భవిష్యత్తులో డ్రైవర్, గార్డులను నియమించే బాధ్యత నుంచి కూడా రైల్వే శాఖ తప్పుకుంటుందని సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో 20 రూట్లలో రైళ్లను నడపడం కోసం ప్రైవేటు ఆపరేటర్ల నుంచి రైల్వే శాఖ ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. రైలు ఏ టైమ్ కు బయలుదేరాలి, ఎన్ని గంటలకు గమ్యం చేరాలి, మొత్తం ప్రయాణానికి ఎంత సమయం తీసుకోవాలన్న అంశాలను కూడా రైల్వే శాఖ నోటిఫికేషన్ లో తెలిపింది.

రూట్ల వివరాలు..
1 సికింద్రాబర్ టు శ్రీకాకుళం (వయా విశాఖ) 13.45 గంటలు (19.45-9.30
2. శ్రీకాకుళం టు సికింద్రాబాద్ (వయా విశాఖ) 14 గంటలు (15.00-05.00)
3. సికింద్రాబాద్ టు తిరుపతి 12.15 గంటలు (06.00-18.15)
4 తిరుపతి టు సికింద్రాబాద్ 12.15 గంటలు (08.40-20.55)
5. గుంటూరు టు సికాంద్రాబాద్ 4.45 గంటలు (23.30-04.15)
6. సికింద్రాబాద్ టు గుంటూరు 4.45 గంటలు (23.30-04.15)
7. గుంటూరు టు కర్నూలు 8 గంటలు (06.00-14.00)
8. కర్నూలు టు గుంటూరు 7.40 గంటలు (14.50-22.30)
9. తిరుపతి టు వారణాశి (వయా సికింద్రాబాద్) 33.45 గంటలు (22.00-7.45)
10. వారణాశి టు తిరుపతి (వయా సికింద్రాబాద్) 33.15 గంటలు (9.45-21.00)
11. సికింద్రాబాద్ టు ముంబై (11.20 గంటలు) (22.25-9.45)
12. ముంబై టు సికింద్రాబాద్ (11.45 గంటలు) (23.35-11-20)
13. ముంబై టు ఔరంగాబాద్ 6 గంటలు (15.45-21.45)
14. ఔరంగబాద్ టు ముంబై 6.10 గంటలు (6.15-12.25)
15. విశాఖపట్నం టు విజయవాడ 6.05 గంటలు (8.40-14.45)
16. విజయవాడ టు విశాఖపట్నం 6.05 గంటలు (16.00-22.06)
17. విశాఖపట్నం టు బెంగళూరు (వయా రేణిగుంట) 16.45 గంటలు (19.45-12.30)
18. బెంగళూరు టు విశాఖపట్నం 17.55 గంటలు (18.00-11.55)
19. హౌరా టు సికింద్రాబాద్ 22.50 గంటలు (18.40-20.00)
20. సికింద్రాబాద్ టు హరా 25.30 గంటలు (05.00-06.30)

ప్రైవేటీకరణతో రూ.30వేల కోట్ల పెట్టుబడులు:
ఈ ప్రాజెక్టు కింద ప్రైవేటు రంగం నుంచి రైల్వేలోకి రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం భావిస్తోంది. ‘ఈ ప్రయత్నంతో రైల్వేలో కొత్త టెక్నాలజీ తీసుకురావడం, మరమ్మతుల ఖర్చు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఉద్యోగాలు, భద్రతలను మరింత పెంచడం, ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించడం లక్ష్యం’ అని రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా… ఈ రైళ్లన్నింటినీ భారత్‌లోనే తయారు చేయనుండడం విశేషం. అందుకు నిధులు అందించడం, వాటిని నడిపించడం, పర్యవేక్షణ బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించనున్నారు. ఈ ప్రాజెక్టు గడువు 35 ఏళ్లు ఉంటుందని రైల్వే చెబుతోంది. రైళ్ళను నడుపుకున్నందుకుగాను ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థలు వాటా ఇవ్వాల్సి ఉంటుంది.

train tickets booking counters to reopen in remote villages

రైల్వేల ప్రైవేటీకరణ విఫల ప్రయోగం:
కాగా రైల్వేల ప్రైవేటీకరణపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘ఇది కేవలం ఓ విఫల ప్రయోగం మాదిరిగానే మిగులుతుంది. చివరకు పుండు మీద కారం చల్లినట్లే ఉంటుంది’ అని కొందరు నిపుణులు చెబుతుండగా, ‘రైల్వేల ప్రైవేటీకరణ ప్రతిపాదనలు సబబే. దీనివల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలందుతాయి. అంతేకాదు… ప్రభుత్వానికి కూడా భారీ స్థాయిలోనే ఆర్ధిక భారం తప్పుతుంది’ అని మరికొందరు చెబుతున్నారు.

సామాన్యులను రైలు ప్రయాణాలకు దూరం చేస్తుంది:
అయితే కొన్ని దేశాల్లో రైల్వేల ప్రైవేటీకరణ జరిగిందని, మన దేశంలో కూడా ప్రైవేటీకరణ జరిపే ముందు ఆయా దేశాల్లోని రైల్వేల స్థితిగతులను హడావిడిగా కాకుండా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరమెంతైనా ఉందనీ మరికొందరు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఎంటే… రైల్వేల ప్రవేటీకరణతో ప్రయాణికులపై విపరీతమైన భారం పడుతుందని, ఇది అంతిమంగా వారిని రైలు ప్రయాణాలకు దూరం చేస్తుందని, తద్వారా రైల్వే వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదముందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

Read Here>>ఫేస్‌బుక్, వాట్సాప్‌ల మాదిరిగా మేడ్ ఇన్ ఇండియా యాప్..