Corona Patients : ఏపీలో కరోనా రోగుల పరిస్థితి దయనీయం..గోడలు, గ్రిల్స్ కు సిలిండర్లు అమర్చి ఆక్సిజన్ సరఫరా
కరోనా సెకండ్ వేవ్ తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.
Problems of corona patients in AP : కరోనా సెకండ్ వేవ్ తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. కొత్తగా వచ్చిన రోగులకు పడకలు లేవు. తగినంత మంది వైద్య సిబ్బంది లేరు. దీంతో అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్న రోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఆస్పత్రుల్లో చోటు, సౌకర్యాలు లేకపోవడంతో వరండాలు, అంబులెన్స్ లోనే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని రోగులు ప్రాణాలు నిలుపుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను ఆస్పత్రుల గోడలకు, గ్రిల్స్, అంబులెన్స్ లకు బిగించుకుని ఊపరి తీసుకుంటున్నారు.
కుర్చీలు, వరండాలోని ఖాళీ ప్రదేశాలు ఆస్పత్రుల బయట బారులు తీరిన అంబులెన్స్ లు ఇలా క్కడబడితే అక్కడ రోగులు అవస్థలు పడుతున్న దృశ్యాలు కుటుంబ సభ్యులు, బంధువుల్లోనే కాదు చూస్తున్న వారందరికీ కంటతడి పెట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో అత్యధిక కేసులు చిత్తూరు జిల్లాలోనే నమోదవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్యం వెయ్యికి చేరువలో ఉంది. ఎక్కడికక్కడ ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. పెరుగుతున్న బాధితుల సంఖ్యకు తగ్గట్లుగా పడకల సంఖ్య పెంచే వీలులేకపోవడంతో బాధితులు ఆస్పత్రి బయటే నరకయాతన అనుభవిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో మూడో వంతు తిరుపతిలోనివి కావడం గమనార్హం. పద్మావతి కోవిడ్ ఆస్పత్రి, రుయా కోవిడ్ ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈఎస్ఐ, ఆయుర్వేద ఆస్పత్రులన్నింటినీ కోవిడ్ ఆస్పత్రులుగా మార్చివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్ని కలిపి 33 చోట్ల చికిత్స అందిస్తున్నారు.
వాటితోపాటు కొన్ని క్వారంటైన్ కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తంగా కలిపి జిల్లాలో 5 నుంచి 6 వేల పడకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగులకు చికిత్స అందించే వీలు లేక వైద్య సిబ్బంది ఒత్తిడి పెరుగుతుంది.
అటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సిబ్బందికి కేటాయించిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలున్నప్పటికీ డబ్బులు ఇచ్చే వారిని మాత్రమే చేర్చుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రోజుకు దాదాపు 2 వేల కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు ఇలాగే పెరిగితే దయనీయ పరిస్థితులు ఏర్పడుతాయన్న భయాందోళన జిల్లా ప్రజల్లో నెలకొంది.
అటు ఏలూరులోనే కరోనా రోగులు పడరాని పాటు పడుతున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పడకలన్నీ నిండిపోయాయి. దీంతో వరండాలోని బెంచులు, అంబులెన్స్ లో రోగులకు వైద్యం అందిస్తున్నారు. వైద్య సిబ్బంది సరిపడా లేకపోవడంతో కుటుంబ సభ్యుులు, బంధువులే ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చుకొని అంబులెన్స్ లో చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రులో చేరేందుకు గంటలు, రోజుల తరబడి నిరీక్షించాలన్సి పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఎక్కడా చూసిన చికిత్స కోసం ఎదురు చూస్తున్న రోగులే కనబడుతున్నారు. తమవారి కంటే, తమవారికి చికిత్స చేయమని వైద్య సిబ్బందిని వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. రోగుల డిమాండ్ తగ్గట్టుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను మరింతగా పెంచాలని పలువురు కోరుతున్నారు.