కోవిడ్ వార్డుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వని ఉన్నతాధికారులు

  • Published By: vijay ,Published On : April 25, 2020 / 02:17 PM IST
కోవిడ్ వార్డుల్లో  పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వని ఉన్నతాధికారులు

కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

 కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఆందోళన దిగారు. గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు అందించడం లేదని వాపోతన్నారు. ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ పట్టించుకోవడం లేదంటున్నారు. 

కోవిడ్ వార్డుల్లో పని చేస్తున్న సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు ఎలా చికిత్స చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో 60 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట, మైదుకూరు ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మాస్కులు, శానిటైజర్లు అందివ్వాలని కోరుతున్నారు. 

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా ఆశించారో అది జరిగింది. శ్రీకాకుళం జిల్లాను కూడా కరోనా తాకింది. జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలోని పాతపట్నం మండలంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో జిల్లా వాసులు, అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆ మూడు కేసులు కూడా ఒకే కుటుంబంలో వారికే నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.

కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది. ఇప్పటి వరకు 171 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇప్పటివరకు 275 కేసులు, గుంటూరు జిల్లాలో 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో మరింత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.