Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాలు… తిరుపతిలో ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో చెట్టు కూలింది.
Andhra Pradesh – Rains: ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బాపట్ల జిల్లా (Bapatla district) వేటపాలెం మండలం కొత్తపేటలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు కొత్తపేటలోని ఓంకార క్షేత్రంలో ధ్వజస్తంభం విరిగిపడింది. తిరుపతి(Tirupati)లోనూ గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు పది నిమిషాలపాటు భీకరంగా గాలులు వీచాయి.
నగరంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో చెట్టు కూలింది. దీంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ చినుకులు పడుతున్నాయి.
తెలంగాణలోనూ రానున్న రెండు రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించకముందే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడం గమనార్హం.
టీటీడీ ఛైర్మన్ స్పందన
గాలి వానపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. “గాలి వాన భారీగా వచ్చిన నేపధ్యంలో గోవిందరాజస్వామీ ఆలయంలో రావిచెట్టు కుప్పకూలింది. వందేళ్ల నాటి చెట్టు గాలికి పడిపోయింది. చెట్టు పడడంతో కడప జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రప్ప మృతి చెందారు. చాలా బాధాకరణమైన ఘటన. ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాం. ఒకరి కాలి, మరొకరికి తలకు గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను” అని చెప్పారు.