MLA Rapaka Varaprasad : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ప్రకంపనలు సృష్టించాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకు ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు చేయాలని తనకు ఆఫర్ చేశారని పేర్కొన్నారు. టీడీపీ నుంచి రూ.10 కోట్లు ఆఫర్ చేశారని వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆఫర్ ఫస్ట్ తనకే వచ్చిందన్నారు. తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా డబ్బు ఆఫర్ చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ దగ్గర కూడా టీడీపీకి ఓటు వేయాలని ఒకరు అడిగారని వెల్లడించారు. సిగ్గు వదిలేసి ఓటు అమ్ముకుంటే రూ.10 కోట్లు వచ్చేవన్నారు. జగన్ ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్ ను తిరస్కరించానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ చేయాలని మొదటి బేరం తనకే వచ్చిందన్నారు.
టీడీపీలో మంచి పొజిషన్ ఇస్తామన్నారని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ కు చెప్పలేదన్నారు. ఒక్కసారి పరువు పోతే సమాజంలో ఉండలేమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజు ద్వారా తకు ఆఫర్ వచ్చిందని తెలిపారు. అయితే, ఒక్కో ఎమ్మెల్యేకి రూ.10 కోట్ల నుంచి 15 కోట్లు ఆఫర్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.
కాగా, రాపాక వరప్రసాద్ ఆరోపణలకు ఉండి ఎమ్మెల్యే రాజు కౌంటర్ ఇచ్చారు. రాపాక వరప్రసాద్ ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇమేజ్ పెంచుకోవడం కోసమే రాపాక ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నాయకుడి మెప్పు కోసం రాపాక వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రాపాక ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీ కోసం పని చేస్తున్నారు? అని ప్రశ్నించారు.