Hijra Murder : భార్యకు తెలిసిపోతుందని.. హిజ్రా దారుణ హత్య కేసులో విస్తుపోయే నిజాలు

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివారులో హిజ్రా దారుణ హత్య స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసులో మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ పరిచయమే కొంపముంచింది.

Hijra Murder : భార్యకు తెలిసిపోతుందని.. హిజ్రా దారుణ హత్య కేసులో విస్తుపోయే నిజాలు

Hijra Murder

Hijra Murder : అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివారులో హిజ్రా దారుణ హత్య స్థానికంగా సంచలనం రేపింది. ఇందిరమ్మ కాలనీ దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని హిజ్రాను (35) శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత దారుణంగా హత్య చేశారు. హిజ్రా గొంతు కోసి హత్య చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ హత్య కలకలం రేపింది. హిజ్రాను పరిగి మండలం యర్రగుంటకు చెందిన నరసింహమూర్తి (నిహారిక)గా గుర్తించారు. ఈ కేసులో మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. చిన్ననాటి మిత్రుడే హిజ్రాను హతమార్చినట్టు గుర్తించారు.

ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హిజ్రా చిన్ననాటి మిత్రుడు మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. నరసింహమూర్తి అలియాస్ నిహారిక ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. అయితే నరసింహమూర్తి హిజ్రాగా మారాడు. అయినా ఆ వ్యక్తితో స్నేహం కంటిన్యూ అయ్యింది. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో తాను రోజూ సంపాదించే మొత్తాన్ని స్నేహితుడికి ఇచ్చేది నిహారిక. ఇలా సుమారుగా లక్ష రూపాయలు అతడికి ఇచ్చింది. నిహారికను యర్రగుంట నుంచి హిందూపురానికి రోజూ ఓ ఆటోలో తీసువెళ్లి తిరిగి అదే ఆటోలో తీసుకొచ్చేవాడు.

ఏం జరిగిందో కానీ, కొన్ని రోజులుగా ఆ వ్యక్తి నిహారికతో మాట్లాడటం సడెన్ గా తగ్గించాడు. ఇది నిహారికకు నచ్చలేదు. అతడితో గొడవపడింది. అయినా అతడు పట్టించుకోలేదు. దీంతో నిహారిక బ్లాక్ మెయిల్ కు దిగింది. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆ వ్యక్తి భార్యకు చెబుతానని బెదిరించింది. దీంతో ఆ వ్యక్తి భయపడ్డాడు. ఇక లాభం లేదనుకుని హిజ్రాను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

నిహారికను నిత్యం ఆటోలో తీసుకెళ్లే ఆటో డ్రైవర్ తో కలిసి ఆ వ్యక్తి పన్నాగం పన్నాడు. మాట్లాడాలని చెప్పి హిజ్రాను పిలిపించాడు. శుక్రవారం రాత్రి హిందూపురం, పెనుకొండ రహదారి పక్కన అంతా కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత నిహారిక గొంతు కోశారు. హత్య చేసిన తర్వాత.. నిహారిక మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.