Shooting On TDP Leader : పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై అర్ధరాత్రి కాల్పులు జరిపారు. ఇంట్లో నిద్రిస్తున్న బాలకొటిరెడ్డిని బయటకు పిలిచి ఆయనపై తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయనపై వైసీపీ నేతలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
వైసీపీ నేతలు పమ్మి వెంకటేశ్వరెడ్డితోపాటు ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, పూజల రాముడు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని చికిత్స కోసం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బాలకోటిరెడ్డి రొంపిచెర్ల ఎంపీపీగా పని చేశారు.
కొద్ది నెలల క్రితమే బాలకోటిరెడ్డిపై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. కత్తులతో దాడి చేసిన ఘటనలో బాలకోటిరెడ్డి గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా స్వగ్రామం అలవాలలో ఆయనపై ప్రత్యర్థుులు మరోసారి కాల్పులతో హత్యాయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని సందర్శించారు.
కాల్పులు జరిపిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. బాలకోటిరెడ్డిని టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.