పాతకక్షల నేపథ్యంలో రౌడీ షీటర్‌ దారుణ హత్య

పాతకక్షల నేపథ్యంలో రౌడీ షీటర్‌ దారుణ హత్య

Rowdy sheeter killed in Rajamahendravaram : పాత కక్షల నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ రౌడీ షీటర్ ను శనివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదెమ్మదిబ్బ బి బ్లాకుకు చెందిన రౌడీ షీటర్ కంచిపాటి సతీష్(25)కు అదే ప్రాంతానికి చెందిన మరో రౌడీ షీటర్ దుర్గాప్రసాద్ కు మధ్య శుక్రవారం రాత్రి ఒక బైక్ విషయంలో గొడవ జరిగింది.

ఆ నేపధ్యంలో శనివారం రాత్రి ఇంట్లో ఉన్న సతీష్ ను దుర్గా ప్రసాద్ బయటకు పిలిచి, మరో ఐదుగురితో కలిసి విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనా స్ధలంలోనే కన్నుమూశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి సతీష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సతీష్ ఒంటిపై 30 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పండు, పోతురాజు వీరబాబు, సాయితోపాటు మరో వ్యక్తి దుర్గప్రసాద్ కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా బ్లేడ్ బ్యాచ్ కు చెందినవారేనని పాతకక్షల నేపధ్యంలో ఈ హత్య జరిగినట్లు వివరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసునమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో మృతుడి జేబులో కూడా ఒక కత్తి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.