అలసత్వం చూపించారా…అంతే – అధికారులకు నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్

అలసత్వం చూపించారా…అంతే – అధికారులకు నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్

SEC Nimmagadda : కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే ఏస్థాయి అధికారిపై అయినా చర్యలు తప్పవని నిమ్మగడ్డ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు. ఏమాత్రం తేడా వచ్చినా కేంద్ర బలగాల్ని దించుతామన్నారు. నిబంధనల అమల్లో ఎక్కడా పొరపాటు జరగకుండా చూడాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ ఆదేశించారు. వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సైతం ఎన్నికలకు దూరంగా ఉంచాలన్నారు. ఎన్నికల్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించిన నిమ్మగడ్డ… ఏకగ్రీవాలను స్వాగతించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారు. 2021, జనవరి 27వ తేదీ బుధవారం ఉదయం పదిన్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో నిమ్మగడ్డ సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ఎస్‌ఈసీ వివరించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే.. ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌పై బదిలీ వేటు వేశారు. ఇద్దరు అధికారులను బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు.. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. ఎస్‌ఈసీ లేఖతో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం జీఏడీకి సరండర్ చేసింది.

మరోవైపు..

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని జనసేన ఆరోపించింది. వైసీపీ నాయకులు, మంత్రులు ఏకగ్రీవ ఎన్నికలకు పిలుపు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలన్న జనసేన.. బెదిరించే విధంగా ఏకగ్రీవాలు ఉండకూడదని చెప్పింది. మంత్రులు ప్రకటనలు ఎన్నికల కమిషన్‌ సుమోటోగా తీసుకుని వివరణ కోరాలని డిమాండ్‌ చేసింది.