మున్సిపోల్స్పై ఎస్ఈసీ ఫోకస్..జిల్లాల టూర్కు సిద్ధమైన నిమ్మగడ్డ
SEC focuses on municipal elections : మున్సిపోల్స్పై ఏపీ ఎన్నికల కమిషనర్ ఫోకస్ పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎసీఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ చర్యలు ప్రారంభించారు. ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు.
ఇవాళ్టి నుంచి వరుసగా మూడు రోజుల పాటు పదమూడు జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు నిమ్మగడ్డ. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, సంసిద్ధతపై అధికారులు, రాజకీయ పార్టీలతో చర్చించి దిశానిర్దేశం చేయన్నారు.
ఇక ఇవాళ్టి పర్యటనలో భాగంగా ఏపీ ఎస్ఈసీ మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి తిరుపతి వెళ్లనున్నారు. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల అధికారులతో సమావేశం కనున్నారు. రేపు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ సమావేశం నిర్వహించనున్నారు.
ఇక సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశం కానున్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా.. ప్రతిరోజు సాయంత్రం గంట పాటు రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం కానున్నారు.