Vaccine Second Dose : 28 రోజులకే రెండో డోసు టీకా, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
Vaccine Second Dose : కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్రం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కొవిషీల్డ్ రెండో డోసును 84 రోజుల తర్వాత పొందాలి. అయితే విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల వ్యవధిలో 1,08,616 మందికి కరోనా పరీక్షలు చేయగా 6వేల 952 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 58 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది. అత్యధికంగా చిత్తూరులో 1,199 కేసులు, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కేసులు వెలుగుచూశాయి. కొత్తగా కరోనాతో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మంది మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు.
కొత్తగా కరోనా నుంచి మరో 11,577 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,99,775 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 91,417 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,03,48,106 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.