నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదు… వరలక్ష్మి హత్య కేసులో సంచలన నిజాలు, అఖిల్ మర్డర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్ అయ్యారు
varalakshmi murder case: నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదు.. ఇదో సినిమా డైలాగ్.. కాని దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడతడు.. తాను ప్రేమించిన అమ్మాయి.. ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. తన ప్రేమను ఒప్పుకోని అమ్మాయి.. అతడ్ని స్నేహితుడిగా మాత్రమే చూడటం తట్టుకోలేకపోయాడు.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ప్రేమికుడు కాస్తా రాక్షసుడిలా మారి.. ప్రేమించిన అమ్మాయినే అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఇది విశాఖ జిల్లాలో సంచలనం రేపిన వరలక్ష్మి హత్య కేసు ఉదంతం.
క్రైమ్ సినిమాలు చూసి.. పోలీసులను తప్పుదోవ పట్టిద్దామనుకున్నాడు:
వరలక్ష్మి హత్య కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు అఖిల్ సాయి.. వరలక్ష్మి ఇంకెవరీ దక్కకూడదన్న కసితోనే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య చేసి.. నేరం బయటపడకుండా ఉండేందుకు.. లా చదివిన తన తెలివితేటలను నేరస్వభావానికి వాడుకున్నాడు అఖిల్. వరలక్ష్మిని చంపి ఆ నేరం నుంచి తప్పించుకునే ప్లాన్ చేశాడు. క్రైమ్ సినిమాలు చూసి.. పోలీసులను తప్పుదోవ పట్టిద్దామనుకున్నాడు. కాని అది సినిమా.. ఇది నిజ జీవితం అని గుర్తించలేకపోయాడు. యువతిని చంపి హత్యానేరం నుంచి తప్పించుకోలేకపోయాడు.
ఓ పాపులర్ సినిమాలో సీన్ ని అమలు చేశాడు:
అయితే అఖిల్ మర్డర్ ప్లాన్ ను చూసి పోలీసులే నివ్వెర పోయారు. వరలక్ష్మిని హత్య చేసిన ప్రాంతంలోని దృశ్యాలను చూసి పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. ఓ పాపులర్ సినిమాలో హత్య చేసిన తర్వాత ఆ ప్రాంతంలో కారం చల్లితే.. నిందితుడి ఆధారాలను డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టలేదన్ని సీన్ను చూసి.. సేమ్ అదే సీన్ ఇక్కడ అమలు చేశాడు అఖిల్. పథకం ప్రకారం ముందుగానే కారం కొనుగోలు చేశాడు. మాట్లాడుకుందాం రమ్మని సాయిబాబా ఆలయానికి వరలక్ష్మిని పిలిచాడు.
దృశ్యం సినిమాలో లాగా కట్టు కథ:
బ్లేడ్తో గొంతు కోసి.. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఆ ప్రాంతంలో కారం చల్లాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అక్కడ క్షుద్ర పూజలు, నరబలి జరిగినట్లు సామాగ్రిని కూడా అమర్చి కొత్త స్టోరీ క్రియేట్ చేశాడు. దృశ్యం సినిమాలో చేసినట్లు.. హత్య చేసే సమయంలో రాము అనే వ్యక్తి అక్కడే ఉన్నట్లు మరో కట్టు కథ అల్లాడు. నేరాన్ని రాముపై మోపే ప్రయత్నం కూడా చేశాడు. కాని పోలీసులు అఖిల్ సాయిని తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం కక్కాడు.
నిందితుడిపై హత్యా నేరంతోపాటు లైంగిక దాడి కేసు:
వరలక్ష్మి హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. సాయిబాబా గుడి పరిసరాలలో కొందరి నుంచి సాక్ష్యాలు కూడా సేకరించారు. నిందితుడిపై హత్యా నేరంతోపాటు.. మైనర్ పై లైంగిక దాడికి పాల్పడిన అభియోగంపైనా కేసు నమోదు చేశారు. నిందితుడిపై మర్డర్ సెక్షన్తో పాటు, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. త్వరలో చార్జ్ షీటు వేస్తామని విశాఖ పోలీస్ కమిషనర్ మనిష్ కుమార్ సిన్హా చెప్పారు.