Andhra Pradesh : హరిత ఆత్మహత్య కేసులో ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సాయి,పవన్ గా గుర్తించారు. మొదటిసారి హరిత ఇంటికి వచ్చిన రికవరీ ఏజెంట్లు చల్లా శ్రీనివాసరావు, నాగరాజుగా గుర్తించారు. రెండవసారి హరిత ఇంటికి వచ్చి అసభ్యంగా మాట్లాడింది సాయి, పవన్ గా గుర్తించారు.
నిందితులను నందిగామ పోలీసుస్టేషన్ కు తరలించారు. నలుగురు రికవరీ ఏజెంట్లతో పాటు మరో ముగ్గురు మేనేజర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా ఏజెన్సీ ఆఫీసుకి తాళం వేసి రికవరీ ఏజెంట్లు పరారీలో ఉన్నారు. శనివారం రాత్రి విజయవాడలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరిత కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించామని నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.
వివరాలలోకి వెళితే జాస్తి హరిత వర్షిణి అనే బాలిక ఈఏపీసెట్లో 15 వేల ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్రావు డిల్లీలోని ఒక ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. కుమార్తె చదువు కోసం తండ్రి ప్రభాకర్రావు… రెండేళ్ల క్రితం కరోనా సమయంలో విజయవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా క్రెడిట్ కార్డుపై మూడున్నర లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటి వద్దకు అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తండ్రిని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతోనూ..లోన్ రికవరీ ఏజెంట్లు చేసిన వ్యాఖ్యలతో హరిత వర్షిణి ఆత్మహత్యకు పాల్పడినట్లుతెలుస్తోంది. మృతురాలి వద్ద లభించిన సూసైడ్ లేఖ ఆధారంగా, బాలిక తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు లోన్ రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు.
Also Read : Andhra Pradesh : బాబాయ్ చెవి ఊడేలా కొరికేసిన అబ్బాయ్