సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : November 14, 2020 / 03:56 PM IST
సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

software employee suicide at anantapur district : బయటకు వెళుతున్నానని భార్యకు చెప్పి, సొంతూరుకు వచ్చి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి విషాద గాధ అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని యల్లనూరు మండలం, వెన్నపూసపల్లికి చెందిన లోకేశ్వర్‌రెడ్డి (24) బెంగుళూరులో సాఫ్టేవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ యువకుడికి గతేడాది నవంబరు 23న కౌసల్య అనే యువతితో వివాహమైంది. దంపతులు బెంగళూరులో నివాసముంటున్నారు.

నవంబర్ 12, గురువారం మధ్యాహ్నం బయటకు వెళుతున్నానని భార్యకు చెప్పి, మోటారు సైకిల్ పై బెంగుళూరు నుంచి డైరెక్టుగా సొంత ఊరుకు వచ్చాడు. రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చేరుకుని తోట వద్ద ఆగాడు. అక్కడ నుంచి తన సెల్ ఫోన్ ద్వారా బంధువులకు, కుటుంబ సభ్యులకు వాయిస్ మెసెజ్ పంపించాడు. భార్య, తల్లి,తండ్రులను బాగా చూసుకోవాలని వారిని కోరాడు.



మెసేజ్ చూసి ఆందోళన చెందిన బంధువులు, కుటుంబ సభ్యులు లోకేశ్వర్ రెడ్డి కోసం గాలింపు చేపట్టారు. ఎంత వెతికినా అతని ఆచూకి లభ్యం కాలేదు. ఈక్రమంలో వారు, తోట వద్ద అతని మోటారు సైకిల్, బావి వద్ద పర్సు గుర్తించారు.

బావిలో దూకి ఉంటాడని భావించి శుక్రవారం ఉదయం నుంచి గ్రామస్ధులు, ఫైర్ సిబ్బంది సహకారంతో బావిలో నీరు బయటకు తోడారు. కాగా, నిన్న రాత్రికి బావి నుంచి శవం లభ్యం అయ్యింది. ఘటనా స్ధలాన్ని డీఎస్పీ శివారెడ్డి, తహసీల్దార్‌ సురే్‌షబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.