Son Sweeper : కన్నతండ్రి కోసం అదే ఆసుపత్రిలో స్వీపర్గా చేరాడు, అయినా ప్రాణాలు కాపాడుకోలేక పోయాడు.. గుండెలు పిండే విషాదం..
కన్నతండ్రిపై ఉన్న మమకారంతో ఓ కొడుకు ఏకంగా స్వీపర్ అవతారం ఎత్తాడు. కుటుంబాన్ని పోషించాలని కాదు... కొవిడ్ బారినపడిన తండ్రి బాగోగులు చూసుకోవాలని. అందుకే ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పారిశుద్ధ్య కార్మికునిగా చేరాడు. విధుల్లో చేరేపాటికే తండ్రి విగతజీవిగా కనిపించడంతో ఆ యువకుని గుండె బద్దలైంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం తన కన్నతండ్రిని బలి తీసుకుందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు
Son Sweeper : కన్నతండ్రిపై ఉన్న మమకారంతో ఓ కొడుకు ఏకంగా స్వీపర్ అవతారం ఎత్తాడు. కుటుంబాన్ని పోషించాలని కాదు… కొవిడ్ బారినపడిన తండ్రి బాగోగులు చూసుకోవాలని. అందుకే ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పారిశుద్ధ్య కార్మికునిగా చేరాడు. విధుల్లో చేరేపాటికే తండ్రి విగతజీవిగా కనిపించడంతో ఆ యువకుని గుండె బద్దలైంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం తన కన్నతండ్రిని బలి తీసుకుందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
అక్కయ్యపాలేనికి చెందిన మధుకిషన్ ఎంబీఏ చదివారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 1902 స్పందన కాల్సెంటర్లో ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. మధుకిషన్ తండ్రి సుదర్శనరావు (67) విశ్రాంత షిప్యార్డు ఉద్యోగి. ఆయన కొవిడ్ బారిన పడడంతో ఈ నెల 2న కేజీహెచ్లో చేర్పించారు. సీఎస్ఆర్ బ్లాక్ నాలుగో అంతస్తులోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల తర్వాత సుదర్శనరావు స్నానాల గదిలో పడిపోవడంతో దెబ్బతగిలి రక్తం బాగా కారింది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆయన తన కుమారులకు ఫోన్ చేసి చెప్పారు. వారు కేజీహెచ్ సూపరింటెండెంట్, వైద్యులకు ఫిర్యాదు చేయడంతో దెబ్బలకు చికిత్స చేశారు.
అయితే అక్కడున్న సిబ్బంది తండ్రిని పట్టించుకోవడం లేదని మధుకిషన్కు తెలిసింది. తండ్రి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆయన దగ్గర ఉండాలని అనుకున్నా బయటవారిని అనుమతించరని తెలిసి పారిశుద్ధ్య కార్మికుడిగా సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. రాత్రి 9.30 గంటలకు విధులకు వెళ్లారు. తండ్రి చికిత్స పొందుతున్న పడక దగ్గరికి వెళ్లి చూడగా కనిపించ లేదు. మరుగుదొడ్డి గది వరండాలో పడిపోయి ఉన్నారు. ఆ దృశ్యం చూసి నిశ్చేష్టుడై పోయారు మధుకిషన్. అదే వార్డులో ఉన్న ఓ వ్యక్తి వచ్చి ఆయన ఎప్పుడో చనిపోయాడని చెప్పడంతో బోరున విలపించారు.
ఆసుపత్రి నాలుగో ఫ్లోర్ సూపర్వైజర్, అక్కడి పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయారని మధు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్, సీఎస్ఆర్ బ్లాక్ ఇన్ఛార్జి, కలెక్టర్, పోలీస్ కమిషనర్కు మధుకిషన్ ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో తన తండ్రి మరుగుదొడ్డి వరండాలో పడిపోతే ఎవరూ పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు.