భార్యాభర్తల గొడవ మధ్యలో వచ్చిన అత్తను కొడవలితో..

భార్యాభర్తల గొడవ మధ్యలో వచ్చిన అత్తను కొడవలితో..

Son in Law killed Aunt: కుటుంబ కలహాలు ప్రాణాన్ని బలిగొన్నాయి. మాటమాట పెరిగి ఆవేశంలో అత్త అని చూడకుండా కొడవలితో హతమార్చేశాడు. భార్యతో మొదలైన తగువులో అత్త తలదూర్చడంతో ఇలా జరిగింది. చెన్నంపల్లిలో శుక్రవారం జరిగిన ఘటన గురించి వివరాలిలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన హుసేన్‌బీ(55) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. రెండో కుమార్తె షేకున్‌బీని నార్పల ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషాతో పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. మద్యానికి బానిసగా మారిన మహబూబ్‌బాషాకు భార్యతో రోజూ గొడవలు అవుతూ ఉండేవి.

వేధింపులు ఎక్కువ అవ్వడంతో రెండ్రోజుల క్రితం తల్లి కూతుర్ని షేకున్‌బీని చెన్నంపల్లికి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం మరోసారి ఫూటుగా మద్యం తాగిన మహబూబ్ తన భార్యను పంపాలని హుసేన్‌బీతో గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి ఆమెపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు.

హుసేన్‌బీ తలకు, చేతులకు గాయాలు అవగా తీవ్ర రక్తస్రావమైంది. పరారైన మహబూబ్‌బాషా నేరుగా నార్పల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తీవ్ర గాయాలకు గురై కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే మృతి చెందింది. నార్పల పోలీసులు నిందితున్ని బుక్కరాయసముద్రం పోలీసులకు అప్పగించారు.