కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు… బెజవాడంతా రెడ్ జోన్

కరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 11:25 AM IST
కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు… బెజవాడంతా రెడ్ జోన్

కరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.

కరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ కట్టడికి జిల్లాలో 25 మండలాలను రెడ్ జోన్ లుగా ప్రకటించారు. నేటి నుండి ఆయా మండలాల్లో పటిష్టంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయనున్నారు. 

గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే 37 మండలాల్లో లాక్ డౌన్ సడలింపు వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు గుర్తించిన ప్రాంతం నుండి 3 కిలోమీటర్ల పరిధితోపాటు దానికి బఫర్ జోన్ కూడా కలుపుకొని మొత్తం 5 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా గుర్తించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో 7 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా పరిగణిస్తారు. రెడ్ జోన్లుగా గుర్తించిన మండలాలు, మున్సిపాలిటీలు మినహాయిస్తే మిగిలిన 37 మండలాలను గ్రీన్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ జోన్ లో లాక్ డౌన్ నిబంధనలు సడలించారు.

జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్న విజయవాడ నగర పాలక సంస్థను రెడ్ జోన్ గా ప్రకటించారు. నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చే విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు, రూరల్ మండలాలు రెడ్ జోన్ లోకి వచ్చాయి. విజయవాడ పశ్చిమ ప్రాంతంలో అధికంగా 20 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విజయవాడ సెంట్రల్ మండలంలో 18 కేసులు, విజయవాడ తూర్పు మండలంలో 17, విజయవాడ ఉత్తర మండలంలో మరో 8 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 63 కేసులు  నమోదు అయ్యాయి. 

విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం కార్పొరేషన్, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, ఉయ్యూరు, పెడన, కొండపల్లి, తిరువూరు, గుడివాడలను రెడ్ జోన్లుగా గుర్తించారు. వీటిలో కొన్ని మున్సిపాలిటీల్లో కేసులు నమోదు కానప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా రెడ్ జోన్లుగా అధికారులు గుర్తించారు. 

గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ లు, క్లినిక్ లన్ని యథావిధిగా పనిచేస్తాయి. మెడికల్ ల్యాబ్ లు, మెడికల్ షాపులు, వెటర్నరీ హాస్పిటల్స్ వాటికి సంబంధించిన మెడికల్ షాపులు తెరిచే ఉంటాయి. అలాగే ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా తమ ఉద్యోగులతో పని చేయించవచ్చు. వ్యవసాయ పనులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పంట కోతలు, నూరిపళ్లు తదితర పనులన్నీ చేసుకోవచ్చు. చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం, పాలు తదితర వాటికి అవసరమయ్యే కేంద్రాలన్నీ గ్రీన్ జోన్ ఏరియాల్లో తెరిచే ఉంటాయి. వాటికి దాణా, మందుల షాపులు కూడా పనిచేస్తాయి. 

ఈ జోన్ పరిధిలో ఉపాధి హామీ పనులు కూడా జరుగుతాయి. వీటిలో నీటిపారుదల, నీటి సంరక్షణ పనులు చేపడతారు. పెట్రోలియం, గ్యాస్ సంబంధిత విక్రయ దుకాణాలు పనిచేస్తాయి. పోస్టాఫీసులు, ఎయిర్ పోర్ట్, రైల్వే గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ లు ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు అందుబాటులో ఉంటాయి. గ్రామ, మండల కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు లభించే కిరణాషాపులు, పాల బూత్ లు, మాంసాహార దుకాణాలు తెరిచే ఉంటాయి. రోడ్లు, బిల్డింగులు తదితర నిర్మాణ పనులు చేపట్టవచ్చు.

జిల్లాలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు ఇన్సిడెంట్ కమాండర్స్ గా రెడ్, గ్రీన్ జోన్ల వారీగా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లను  జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నియమించారు. గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల్లో లాక్ డౌన్ సడలింపు అధికారాలు వారికే ఉంటాయి. జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 20, 202) మరో ఐదు కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది.

విజయవాడ నగరం, రూరల్ ప్రాంతాల్లో కొత్తగా వచ్చిన ఐదు కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు కలిగి ఉన్నవారుగా గుర్తించారు. గొల్లపూడి, ఆటోనగర్, ఖుద్దూస్ నగర్, కానూరు, అయోధ్యనగర్ లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. 

విజయవాడ నగర పరిధిలోని ఐదు మండలాలతో పాటు మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, పెనమలూరు, కంకిపాడు, చందర్లపాడు మండలాలు ఉన్నాయి. వీటితోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో 7 కిలోమీటర్ల పరిధిలోపు వచ్చే జిల్లాలోని కైకలూరు, కలిదిండి మండలాలను కూడా రెడ్ జోన్ గా గుర్తించారు.