ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా చంద్రబాబు?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత దీన్ని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.
పిటిషనర్ ఆర్కే తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించి విచారణకు ఖచ్చితమైన తేదీని నిర్ణయించాలని కోరారు. లిఖితపూర్వక ఆదేశాల్లో తేదీని వెల్లడిస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. అప్పటికీ ఆ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్ధించారు. రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు వాదప్రతివాదనలు విన్న తర్వాత ఈ కేసు వచ్చే సంవత్సరం జులైకి విచారణ చేపడతామని తెలిపింది.