Sc anger over TS Govt : ‘విద్యుత్ శాఖ అధికారులకు జైలుశిక్షే పరిష్కారం’ అంటూ తెలంగాణ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు జైలుశిక్ష విధించటమే పరిష్కారం అంటూ వ్యాఖ్యానించింది.
supreme court anger over telangana Govt : తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 11,2022) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు జైలుశిక్ష విధించటమే పరిష్కారం అంటూ వ్యాఖ్యానించింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మంది విద్యుత్ ఉద్యోగులకు తక్షణమే పోస్టింగ్లు ఇవ్వాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ ఉద్యోగులు అమలు చేయలేదని మండిపడిన కోర్టు తీవ్రంగా మండిపడింది.
ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు ఇవ్వటానికి ఇదే చివరి అవకాశం ఇస్తున్నామంటూ తీవ్రంగా మందలించింది ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ (2022)31కి వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రెండు వారాల్లోగా జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక అమలు అయ్యిందా?, లేదా? అన్న విషయంపై ఈ నెల 31న మరోమారు సమీక్ష చేస్తామని వెల్లడించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్తా రెండు తెలుగు రాష్ట్రాలుగా రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదాన్ని పరిష్కరించకుండా తమ జీవితాలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని వాపోతు తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగుల విభజనకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులకు ఏపీ పోస్టింగ్లు ఇవ్వగా… ఏపీ నుంచి రిలీవ్ అయిన వారిలో కొందరికి పోస్టులు ఇచ్చిన తెలంగాణ ఇంకో 84 మందికి ఇంకా పోస్టింగ్లు ఇవ్వలేదు. దీనిపై 84 మంది ఉద్యోగులు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం (అక్టబర్ 11)సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. కోర్టుల ఆదేశాలను తెలంగాణ సర్కారు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ఉద్యోగులు ధర్మాసనానికి ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఉద్దేశపూర్వకంగానే కోర్టుల ఆదేశాలు ఉల్లంఘించారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే… కోర్టు ధిక్కరణ కింద విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. 84 మంది ఉద్యోగులకు పోస్టింగ్లు ఇచ్చేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని తీవ్రంగా మందలించింది.