CBSE Syllabus : ఏపీలో 7వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్
7వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
AP Cabinet approved the CBSE syllabus : 7వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో సీబీఎస్ఈ విద్యాబోధన ఉంటుందని అన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపరేఖలు మార్చి ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉండేలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బోధనా సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేస్తామన్నారు. అధ్యాపకుల నైపుణ్యం పెంచుతామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం అన్నారు.
పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నామని పేర్ని నాని తెలిపారు. 2.5 శాతం స్వల్ప వడ్డీతో రుణం తీసుకున్నామని చెప్పారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో అరకొర చదువులు చెప్తున్నారని.. ఎయిడెడ్ సంస్థలు ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిదని హితవు పలికారు.
ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్ యూనివర్శిటీల్లో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాకు ఇవ్వాలని సూచించారు. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.