రాజధాని విషయంలో మా పాత్ర లేదు… నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలదే

  • Published By: bheemraj ,Published On : August 19, 2020 / 05:53 PM IST
రాజధాని విషయంలో మా పాత్ర లేదు… నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలదే

పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్ డీఏ చట్టం రద్దు నిర్ణయాల అంశంలో దోనే సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.



ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ అండర్ సెక్రటరీ లలిత అఫిడవిట్ దాఖలు చేశారు. 2014 ఏప్రిల్ 23న అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొందని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాజధాని అభివృద్ధికి నిధులు విడుదల చేసిందని అందులో పేర్కొన్నారు.



రాజధాని నిర్ణయించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్రలేదని తమ రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్ర ప్రాంతాల అభివృద్ధి 2020 చట్టం రూపకల్పన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని అఫిడవిట్ లో పేర్కొంది.



చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. (ఆగస్టు 14, 20020) పేర్కొన్న అంశాలనే కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.