ఏపీలో ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఏపీలో ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ap panchayat elections : ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాల్గో విడతలో 2,743 సర్పంచ్, 22,423 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.90 శాతం పోలింగ్ నమోదు అయింది. ఏపీలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 81.67 శాతం, రెండో విడతలో 81.67 శాతం, మూడో విడతలో 80.71 శాతం, చివరి విడతలో 80 శాతం పోలింగ్ దాటింది.

మొత్తం 13 జిల్లాలోని 161 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 2,743 సర్పంచ్ స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 22,423 వార్డు మెంబర్ స్థానాలకు 52,700 మంది రంగంలో ఉన్నారు. 28 వేల 995 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.

3,299 సర్పంచ్ స్థానాలకుగానూ 554 ఏకగ్రీవం అయ్యాయి. 33,435 వార్డులకుగానూ 10,921 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. సున్నితమైన ప్రాంతాలపై ఎస్ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.