టీడీపీ నేత హత్య కేసులో వైసీపీ నేతల పేర్లు నమోదు… భార్య అపరాజిత స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన పోలీసులు

టీడీపీ నేత హత్య కేసులో వైసీపీ నేతల పేర్లు నమోదు… భార్య అపరాజిత స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన పోలీసులు

TDP leader Nandam Subbayya murder case : కడప జిల్లా టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో వైసీపీ నేతల పేర్లు నమోదయ్యాయ్‌. టీడీపీ నేత భార్య వినతితో ధర్నా చేపట్టిన నారా లోకేశ్‌.. ఎఫ్‌ఐఆర్‌లో వైసీపీ ఎమ్మెల్యే పేరు నమోదు చేయించి అనుకున్నది సాధించారు. నందం సుబ్బయ్య హత్య కేసు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు కొత్త పేర్లను అప్‌డేట్‌ చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహా మరో ఇద్దరి పేర్లు చేరుస్తామని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలంటూ సుబ్బయ్య భార్య అపరాజిత డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రొద్దుటూరు వెళ్లిన నారా లోకేష్‌కు ఆమె ఇదే విషయాన్ని చెప్పి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో లోకేష్ సహా టీడీపీ నేతలు మృతదేహంతో ధర్నాకు దిగారు. ఆ ముగ్గురి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే వరకు ప్రొద్దుటూరు వీడేదిలేదంటూ అంత్యక్రియలు జరపకుండా టీడీపీ నేతలు ధర్నా నిర్వాహించారు.

టీడీపీ నేతల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో.. డీఎస్పీలు ప్రసాదరావు, నాగరాజు వచ్చి ఆందోళన విరమించాలని లోకేష్‌ను కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు సెక్షన్‌ 161 ప్రకారం ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ పేర్లను కేసులో చేర్చుతున్నట్లు పోలీసులు తెలిపారు.

డీఎస్పీ ఆధ్వర్యంలో సుబ్బయ్య భార్య అపరాజిత దగ్గర వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు. నమోదు చేసిన వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు అందించనున్నారు. ఈ హత్య కేసుపై 15 రోజుల్లో విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ ప్రసాదరావు హామీ ఇచ్చారు. పోలీసులు ఎంక్వైరీపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఆందోళన విరమించారు.